తప్పు చేస్తే ఎమ్మెల్యే అయినా జైలుకే.. టీడీపీ నేతల గుడివాడ పర్యటనపై పేర్నినాని ఫైర్
ఆంధ్రప్రదేశ్ గుడివాడలో క్యాసినో వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నిజనిర్థారణ కమిటీ గుడివాడలో కె.కన్వెన్షన్ సెంటర్ పరిశీలనకు బయలుదేరి వెళ్లింది. అయితే అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ బృందాన్నిఅడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. ఈ సమయంలో టీడీపీ నేత బొండ ఉమ కారు అద్దాలను కొందరు ద్వంసం చేశారు. ఈఘటనపై మంత్రి పేర్ని నాని స్పందించారు. క్యాసినో వ్యవహారంపై నిజనిర్ధారణ చేయడానికి వారెవ్వరంటూ నిలదీశారు.
కొడాలి నానిపై కావాలనే ఆరోపణలు
తప్పు చేస్తే జగన్ ప్రభుత్వం ఎవర్ని వదిలి పెట్టదని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. తమ పార్టీ ఎమ్మెల్యే అయినా కేసు పెట్టి ముఖ్యమంత్రి లోపల వేయమంటారని పేర్కొన్నారు. అసలు టీడీపీ నేతలకు గుడివాడకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. క్యాసినో వ్యవహారంపై నిజనిర్ధారణ చేయడానికి వారికేం అధికారం ఉందని నిలదీశారు. మంత్రి కొడాలి నానిపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నేతలకు వార్నింగ్
చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని.. నిజంగా తప్పు చేస్తే జడ్జీలను కూడా తమ ప్రభుత్వం వదలదని మంత్రి పేర్నినాని అన్నారు. గుడివాడలో నిజంగా తప్పు జరిగితే సీఎం జగన్ తప్పక చర్యలు తీసుకుంటారని ఎవర్ని వదలిపెట్టరని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారిపై ఎవ్వరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడితే కుదరదని ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు. తాము ఎవ్వరికి భయపడేది లేదన్నారు. నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Recommended Video
కొడాలి నానిని అరెస్ట్ చేయాలి.. దేవినేని ఉమ
అటు.. గుడివాడలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. బూతుల మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేసి ఆరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ సంపాదన గుట్టు బయట పడడంతో క్యాసినో మంత్రి అసహనంతో ఊగిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. విష సంస్కృతిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ రౌడీ మూకలు దాడిచేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఉమ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.