వయాగ్రా వేసుకున్నట్టు వూగిపోతే ఎలా చంద్రబాబు .. విజయ్ మాల్యా , నిమ్మగడ్డ సేమ్ టూ సేమ్ : పేర్ని నానీ
ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబుపై వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిన్న యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇవ్వగా , మంత్రి పేర్ని నాని మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తనలాగే ఉండాలని, ఇప్పుడు వయసుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే బాగోదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లేటు వయసులో వయాగ్రా వేసుకున్నట్లు ఊగిపోతే ఎలాగని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
90 ఏళ్ల వయసులో అలిసిపోయాను , తాను పెళ్లి చేసుకోను అన్నట్టు రాజకీయ సన్యాసం వ్యాఖ్యలు
రాజధాని అమరావతి, 3 రాజధానులు పై రెఫరెండం కోసం చంద్రబాబు కోరడంలో అర్థమే లేదని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు . మూడు రాజధానులు ప్రజలు ఆమోదిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, 90 ఏళ్ల వయసు ఉన్నవాడు ఇక అలిసిపోయాను , తాను పెళ్లి చేసుకోను అని అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వానికి కానీ, పార్టీలకు గాని చేసే సవాలు హేతుబద్ధంగా ఉండాలని, హేతుబద్ధత లేని సవాళ్లను చేయకూడదని చంద్రబాబుకు హితవుపలికారు పేర్నినాని.
జగన్ సొంతిల్లు అమరావతిలోనే ఉంటుంది .. అమ్ముకొని పోవట్లేదు
రాజధాని అమరావతి కొనసాగుతుందని ఎన్నిసార్లు చెప్పినా, పదే పదే రాజధాని అమరావతి అంటూ చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుంది. శాసనాలను తయారు చేసే చట్టసభ కూడా ఇక్కడే ఉంటుంది అని, అంతేకాదు సీఎం జగన్ కూడా అమరావతి లోనే ఉంటారని, సొంతింటిని అమ్మేసుకుని వెళ్ళిపోవడం లేదని మంత్రి పేర్ని నాని టిడిపి నేతల తాజా వ్యాఖ్యలను ఉద్దేశించి పేర్కొన్నారు.
జనరణభేరిలో చంద్రబాబు వ్యాఖ్యల దుమారం ... తిట్టిపోస్తున్న వైసీపీ మంత్రులు
రాజధాని అమరావతి ఉద్యమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన జనరణభేరిలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రాజధానులు రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. చంద్రబాబు మూడు రాజదానులపై ప్రభుత్వాన్ని రెఫరెండం కోరారు. ఇక అప్పటి నుండి చంద్రబాబు వ్యాక్యలను టార్గెట్ చేస్తూ వైసీపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు . చంద్రబాబుకు ఇవి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు .
కోర్టులలో నిత్యం కేసులు వేస్తూ .. విజయ్ మాల్యాలా నిమ్మగడ్డ తీరు ..
అంతే కాదు కరోనా వ్యాప్తి కారణాలను సాకుగా చూపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పుడు స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విదేశాల్లో ఉన్న దేశ ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా తో పోల్చారు. విదేశాల్లో ఉన్న విజయమాల్యా దేశంలోని న్యాయస్థానం ఆశ్రయిస్తున్నారు అని, ఆంధ్ర ప్రదేశ్ లో కనిపించని నిమ్మగడ్డ కూడా చీటికిమాటికి హైకోర్టులో కేసులు వేస్తున్నారని, వీరిద్దరు ఒక్కటేనంటూ ఘాటుగా విమర్శించారు మంత్రి పేర్ని నాని.