కలెక్టర్తో ఆటోలో ప్రయాణించిన ఏపీ మంత్రి!: ఎక్కడికి?, ఎందుకు?
రవాణా శాఖ అధికారులు, కలెక్టర్ భాస్కర్, ఏలూరు మేయర్ నూర్జహాన్ సహా మంత్రి పితాని ఒకే ఆటోలో ప్రయాణించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత.. ఆటో బిల్లును మొబైల్ యాప్ ద్వారా చెల్లించారు.
విజయవాడ: ప్రజలను నగదు రహిత చెల్లింపుల వైపు మళ్లించేందుకు ఏపీ కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. ఏలూరు కలెక్టర్ను వెంటపెట్టుకుని ఓ ఆటోలో ఆయన ప్రయాణించారు. అనంతరం ఆటో చెల్లింపులను మొబైల్ యాప్ ద్వారా చెల్లించేశారు.
ప్రజలకు నగదు రహిత చెల్లింపుల పట్ల అవగాహన కల్పించడానికి మంత్రి పితాని చేస్తున్న ప్రయత్నం పలువురిని ఆకట్టుకుంది. రవాణా శాఖ అధికారులు, కలెక్టర్ భాస్కర్, ఏలూరు మేయర్ నూర్జహాన్ సహా మంత్రి పితాని ఒకే ఆటోలో ప్రయాణించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత.. ఆటో బిల్లును మొబైల్ యాప్ ద్వారా చెల్లించారు.
కలెక్టర్ భాస్కర్ రూ.50 ఆటో బిల్లును యాప్ ద్వారా ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాలో జమచేశారు. చిల్లర సమస్యలు తలెత్తకుండా ఆటో చార్జీలకు వీలుగా ఉండేందుకు అనువుగా ఈ యాప్ తయారు చేసినట్లు చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి పితాని మాట్లాడుతూ భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడేందుకు ఇప్పటినుంచే ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులకు పిలుపునిచ్చారు.