మేం బరితెగించడం లేదు: బీజేపీపై మంత్రి పితాని, పవన్-జగన్ ఎఫెక్ట్.. రంగంలోకి బాబు
అమరావతి: ఆదివారం బీజేపీ పదాదికారుల సమావేశం, టీడీపీపై ఆ పార్టీ ఆగ్రహం నేపథ్యంలో టీడీపీ కూడా మండిపడుతోంది. మంత్రి పితాని సత్యనారాయణ కేంద్రంతో లెక్కలు తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మార్చి 5లోపు బీజేపీ నేతలు ఏం చెబుతారో చెప్పాలన్నారు.
బాబుకు రివర్స్: బీజేపీ మంత్రుల రాజీనామా? మిస్టర్ సీఎం.. విష్ణు సంచలనం, గల్లాకు కౌంటర్
విభజన చట్టంలో ఉన్నవన్నీ అమలు చేస్తామని బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు. ప్యాకేజీ ఎంత ఇచ్చారో బీజేపీ నేతలు చెప్పగలరా అని నిలదీశారు. కేంద్రానికి ఆఖరు బడ్జెట్ కాబట్టి మేం నోరు విప్పామని తెలిపారు. మిత్రపక్షంగా ఉండి కూడా పోరాడవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
హక్కులు సాధించలేనప్పుడు ఏం చేయాలో చూస్తాం
తాము బీజేపీ నేతల్లా బరితెగించి మాట్లాడటం లేదని, ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నామని పితాని చెప్పారు. తాము సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మేం హక్కులు సాధించే పనిలో ఉన్నామన్నారు. అవి సాధించలేనప్పుడు ఏం చేయాలో అది చేస్తామన్నారు.
అఖిలపక్షం యోచనలో చంద్రబాబు
కేంద్ర బడ్జెట్లో అన్యాయం, ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలుపరచడం లేదంటూ ఏపీలోని పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో తుది తేదీని నిర్ణయించనున్నారు.
25న అఖిలపక్షం?
ఏపీకి ప్రత్యేక హోదా లేదా విభజన హామీల కోసం అన్ని పార్టీలు లేదా ఏపీలోని పలు సంస్థలు ఏకమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు అఖిలపక్షం యోచన చేస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీకి కేంద్రం నుంచి వచ్చిన లెక్కలను తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు, జగన్ హోదా గళం గట్టిగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అఖిలపక్షం 25వ తేదీన ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. మంగళవారం తేదీ ఖరారు కానుంది.
ఎవరెవరిని పిలవాలనే అంశంపై చర్చించనున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా కంటే కేంద్రం అవసరం ఇప్పుడు ఉందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎవరెవరిని పిలవాలనే అంశంపై టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు, టీడీపీ నేతల విమర్శలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. కేంద్రం ఏపీ పట్ల చిన్నచూపు చూస్తోందని చెప్పడం సరికాదన్నారు. ఏపీకి 24 గంటల విద్యుత్ కేంద్రమే ఇస్తోందన్నారు. గృహ నిర్మాణం కింద లక్షలాది ఇళ్లు వస్తున్నాయన్నారు.