చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
చంద్రబాబుపై మంత్రి ఆర్ కే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. నందమూరి తారకరత్న ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరడానికి నారా లోకేష్ లెగ్గు మహత్యమేనని ఆరోపించారు. తారకరత్నను పరామర్శించే తీరిక కూడా లోకేష్ కు లేదని విమర్శించ
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. తనదైన శైలిలో చురకలు అంటించారు. నారా లోకేష్ తో చంద్రబాబుకు ప్రమాదాలు పొంచివున్నాయని చెప్పారు. నందమూరి తారకరత్న ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరడానికి నారా లోకేష్, ఆయన లెగ్ ప్రధాన కారణం ఆరోపించారు. తారకరత్నను పరామర్శించే తీరిక కూడా లోకేష్ కు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
శ్రీనగర్ లాల్చౌక్లో రేవంత్ రెడ్డి- భరతమాత ముద్దుబిడ్డగా అది నా బాధ్యత
చంద్రబాబు సైకో
ఇవ్వాళ ఆమె విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సైకో అయితే- ఆయన కొడుకు లోకేష్ ఐరన్ లెగ్ అని మంత్రి రోజా అన్నారు. లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన సంఘటనలను కూడా ఆమె విరించారు. లోకేష్ అడుగు పెట్టగానే రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. లోకేష్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టగానే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయని చెప్పారు.
పాదయాత్ర పోస్టర్ రిలీజ్..
నారా లోకేష్ తన యువ గళం పాదయాత్ర పోస్టర్ ను రిలీజ్ చేసినప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిది మంది చనిపోయారని, ఇక పాదయాత్ర చేపట్టిన తొలిరోజే నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యాడని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని రోజా చెప్పారు. తారకరత్న ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంటే నారా లోకేష్ కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఆ అర్హత లేదు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పరిపాలన గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు లేదని రోజా అన్నారు. పాదయాత్ర తొలి రోజు ప్రసంగంలో లోకేష్ పాండిత్యాన్ని ప్రజలందరూ చూశారని, తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం, రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారని, ప్రజల కష్టాలను కళ్లారా చూసి, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 98 శాతం హామీలు పూర్తిచేశారని చెప్పారు.
అదే భ్రమలో..
నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశాడని రోజా నిలదీశారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించ వచ్చనే భ్రమలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా వైఎస్ జగన్.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయాలను ఏర్పాటు చేసి లక్షలాదిమందికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చారని రోజా వివరించారు.
ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా..
చంద్రబాబు ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు సాగించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను వైఎస్ జగన్ ప్రభుత్వంలో విలీనం చేశారని రోజా అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేశారని, కరోనా సమయంలో కోట్లాదిమంది ప్రజలకు సేవలను అందించారని చెప్పారు. పోలీస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో నిరుద్యోగులైన చంద్రబాబు, లోకేష్ మాత్రమే రోడ్ల మీదకు వచ్చారని, వారి పాదయాత్రకూ ప్రజల నుంచి మద్దతు లభించట్లేదని చెప్పారు.