దుక్కలా ఉండి పెన్షన్ కావాలా : భర్త పోయాడా అంటే చెప్పరు : మహిళల పై అయ్యన్న ఆక్రోశం..!
ఆయన ఓ మంత్రి. టిడిపి అవిర్భావం నుండి రాజకీయాల్లో ఉన్న సీనియర్. ప్రజల కోసమని చెబుతూ ఏపి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో అసభ్యంగా మాట్లాడారు. మహిళల పై రాజకీయాల్లో ఉన్న వారే కాదు..ఎవరూ మాట్లాడని విధంగా..ప్రజలు - అధికారుల సమక్షంలో మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేసారు..
మంత్రి అయ్యన్న పాత్రుడు మహిళల పై నోరు పారేసుకున్నారు. విశాఖ జిల్లాలోని బుచ్చయ్య పేట మండలం చిన్న పాలెం లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి ఆయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. కొందరు మహిళలు తమకు వితంతు పెన్షన్లు కావాలని కోరగా..మంత్రి స్పందించిన తీరు వివాదాస్పదమైంది. బాధ్యత గల పదవిలో ఉన్న ఓ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం పై సభకు హాజరైన మహిళలతో పాటుగా..వేదిక పై ఉన్న మహిళా అధికారిణి లు సైతం తల దించుకొని కూర్చొన్నారు. అయితే, అసలు మంత్రి ఇంత స్పృహ లేకుండా ఎలా మాట్లాడారని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
భర్తలను రాచి రంపాన పెడితే పారి పోతున్నారు..
ఏపి మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపిలో కలకలం రేపుతున్నాయి. జన్మభూమి వేదికగా మహిళల పై అసభ్యంగా మాట్లాడారు. భర్త చనిపోతే పెన్షన్ అడిగితే సరే గానీ..దుక్కలా ఉండి పెన్షన్ అడిగితే ఎలా అంటూ వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా.. గ్రామాల్లో కొంత మంది మహిళలు తమకు భర్త లేడు..పెన్షన్ కావాలని అడుగుతారు. భర్త ఉన్నాడా..పోయాడా అంటే చెప్పరు..అని కించ పరిచే వ్యాఖ్మలు చేసారు. పదేళ్లుగా భర్త జాడ లేదని చెబుతున్నారని..అలాంటి వారికి పెన్షన్ ఎందుకు ఇస్తామని ప్రశ్నించారు. ఎక్కడి నుండి ఇస్తాం..భర్తలను మీరు రాచి రంపాన పెడితేనే వారు పారిపోయారు అంటూ వితంతువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహిళల ఆగ్రహా నికి కారణమవుతున్నాయి. ఈ వ్యాఖ్యల పై స్థానిక మహిళలు అక్కడే ఆగ్రహం వ్యక్తం చేసారు.