ఏపీలో 'వసూళ్ళ నారాయణ'... ఆ మంత్రి పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం .. పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్ నారాయణ 'వసూళ్ళ నారాయణ' అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది వైసీపీ నేతలకు తలనొప్పిగా తయారైంది. ఇటీవల పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి శంకర్ నారాయణ అనుచరులు దందాలకు తెర తీశారని, వసూళ్ళకు పాల్పడుతున్నారని ప్రచారం జోరుగానే జరిగింది . దీంతో కేబినెట్ మంత్రి శంకర్ నారాయణకు వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ ప్రచారం జోరుగా సాగుతుండటంతో వారిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంత్రి శంకర్ నారాయణపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం
కియా ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు మంత్రి శంకర్ నారాయణపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు పెనుకొండ మండలం వెంకటగిరి పాలెం కి చెందిన శ్రీధర్రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక ఇంతగా శంకర్ నారాయణ గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరగటానికి కారణాలు లేకపోలేదు .పెనుకొండ నియోజక వర్గంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని భావించిన నేపధ్యంలో మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున దందాలకు దిగారని ఆరోపణలు వచ్చాయి.
వసూళ్ళకు పాల్పడ్డారని ఆరోపణలు ... వసూళ్ళ నారాయణ అంటూ ప్రచారం
ఇంటి పట్టా మంజూరు చేయిస్తానంటూ శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారని, ఒక్కొక్కరి నుండి 20 వేలు వసూలు చేసి ఇంటి స్థలం ఇవ్వలేదని పెద్ద రగడే నడిచింది. దీంతో మంత్రి అనుచరులు వారిపై పోలీసులతో దౌర్జన్యానికి దిగటం ఆ తర్వాత బాధితులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చెయ్యటం వంటి ఘటనలతో ఈ పంచాయితీ తెలిసినా మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారనే ప్రచారం జరిగింది. దీంతో ఇదంతా మంత్రికి తెలిసే జరిగందని, మంత్రి శంకర్ నారాయణ చేయించారని సోషల్ మీడియాలో వసూళ్ళ నారాయణ అంటూ ప్రచారం జోరందుకుంది. దీంతో వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీకి తలనొప్పిగా మారిన ప్రచారం .. కేసు నమోదు
ఇక బీసీ సంక్షేమ శాఖా మంత్రిగా పని చేస్తున్న శంకర్ నారాయణ 2019 ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి బీకే పార్ధసారధి మీద 15వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో అనంతపురం జిల్లా కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఒకపక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత పారదర్శక పాలన సాగించాలని భావిస్తుంటే మంత్రి పైనే ఈ తరహా ఆరోపణలు రావటం ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతుంది. వైసీపీ నేతలకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే కేసు నమోదు చేశారు వైసీపీ నేతలు.