అసంతృప్తులకు మంత్రి సోమిరెడ్డి బుజ్జగింపులు, వైసీపీకి చెక్ పెట్టేనా?
నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్యలను ప్రారంభించారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్యలను ప్రారంభించారు. పార్టీలోని పాత, కొత్త నాయకులను సమన్వయం చేసే పనిని ప్రారంభించారు.పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించారు సోమిరెడ్డి.
మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరనలో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రిపదవి దక్కింది. ఇదే జిల్లా నుండి నారాయణ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
అయితే సుదీర్ఘ కాలం నుండి రాజకీయాల్లో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవిని కట్టబెట్టింది.అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టిపట్టుంది.
అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీయాలంటే టిడిపిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది.
ఈ మేరకు ఇతర పార్టీల్లో బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించింది. మరో వైపు అదే సమయంలో పార్టీలోని నాయకుల మధ్య సమన్వయం కోసం నాయకులు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
అసంతృప్త నాయకులతో సోమిరెడ్డి చర్చలు
నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకుగాను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసంతృప్త నాయకులతో చర్చించారు. ఆదివారం నాడు పలువురు పార్టీ నాయకుల ఇళ్లకు ఆయన స్వయంగా వెళ్ళి వారిని బుజ్జగించారు. కలిసి పనిచేద్దామంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసంతృప్తులను తృప్తిపర్చేందుకు ప్రయత్నించారు.స్వంత పార్టీకి చెందిన నాయకులతో పాటు వామపక్షపార్టీలకు చెందిన నాయకులతో కలిసి ఆయన చర్చించారు. జిల్లా అభివృద్దికి కలిసి పనిచేద్దామంటూ ఆయన కోరారు.
2019 ఎన్నికలే లక్ష్యంగా సోమిరెడ్డి పావులు
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి నెల్లూరు జిల్లాలో తక్కువ సీట్లు వచ్చాయి.అయితే రానున్న ఎన్నికల్లో అధిక సీట్లను కైవసం చేసుకోవడానికి టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆనం సోదరులను టిడిపిలో చేర్చుకోంది. మరో వైపు పార్టీలోనే ఉంటూ అసంతృప్తిగా ఉన్న నాయకులను బుజ్జగించే ప్రయత్నాలను ప్రారంభించింది.పాత, కొత్త తరం పార్టీ నాయకులను సమన్వయం చేసుకొనే ప్రయత్నాలను ప్రారంభించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మరో వైపు మంత్రుల మద్య సమన్వయంతో పనిచేస్తున్నారనే సంకేతాలను పంపారు.
సోమిరెడ్డి స్వయంగా పిలిచినా రాలేదు
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెల్లూరుకు వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అభినందన సభను ఏర్పాటు చేశారు.అయితే ఈ సభకు రావాలని ఆనం సోదరులకు, ఆదాల ప్రభాకర్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వనించారు.అయితే ఈ సభకు వారు రాలేదు.దీంతో ఆదివారంనాడు ఆనం వివేకానందరెడ్డితో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గంటకు పైగా చర్చించారు. మరో వైపు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడ సోమిరెడ్డి చర్చించారు.టిడిపి నాయకుడు రమేష్ రెడ్డి,వైటీ నాయుడు, కిలారు వెంకటస్వామి నాయుడు ఇళ్ళకు వెళ్ళి మంత్రి వారితో చర్చించారు.అయితే సోమిరెడ్డితో తమకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవన్నారు ఆనం వివేకానంద రెడ్డి.
సమీక్షల్లో మంత్రులిద్దరూ ఒకే వేదికపై
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు కలిసి పనిచేస్తున్నారనే సంకేతాలు ఇచ్చారు మంత్రులు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందన సభకు మంత్రి నారాయణ హజరయ్యారు. మరో వైపు శనివారం నాడు జరిగిన అధికారిక కార్యక్రమాల్లో మంత్రులిద్దరూ పాల్గొన్నారు. శనివారం నాడు జరిగిన అధికారులతో సమీక్షల్లో మంత్రులిద్దరూ పాల్గొన్నారు.మంత్రులిద్దరూ సమన్వయంతో పనిచేస్తున్నారనే సంకేతాలిచ్చారు.
సిపిఎం నేత వెంకయ్య ఆశీస్సులు కోరిన సోమిరెడ్డి
సిపిఎం సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జక్కా వెంకయ్య ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిశారు. ఆయనతో పలు అంశాలపై చర్చించారు. జిల్లా అభివృద్దికి జక్కా వెంకయ్య ఇచ్చే సూచనలు, సలహలను స్వీకరిస్తానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో సిపిఎంతో కలిసి చేసిన పోరాటాలను మంత్రి గుర్తు చేసుకొన్నారు.సారా వ్యతిరేక ఉద్యమంలో చేసిన పోరాటాలను మంత్రి ప్రస్తావించారు.