సాయిరెడ్డి మాటకు వేరే రాష్ట్రంలో జైల్లో పెడతారు: రమణదీక్షితులుకు సోమిరెడ్డి క్షమాపణ
అమరావతి: రమణ దీక్షితులుపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతునన్నానని టీడీపీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయి రెడ్డిని అనాల్సిన మాటను రమణదీక్షితులను అన్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయన్న సాయిరెడ్డి వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయన్నారు.
రమణ దీక్షితులుపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని తాను అని చెప్పారు. ఇంకో రాష్ట్రంలో అయితే విజయ సాయి రెడ్డిని లోపల వేసేవాళ్లన్నారు. కానీ రమణ దీక్షితులుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నానని చెప్పారు.
నన్నే తప్పుదోవ పట్టించారు
శ్రీవారి ఆభరణాల విషయంలో ప్రధాన భద్రతా పర్యవేక్షణాధికారినే తప్పుదోవ పట్టించిన రమణ దీక్షితులు నేడు శ్రీవారి నగల భద్రతపై ఆరోపణలు చేయడం సమంజసంగా లేదని టీటీడీ మాజీ భద్రతా పర్యవేక్షణాధికారి బీవీ రమణ కుమార్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఆయన టీటీడీలో ప్రస్తుతం నెలకొన్న వివాదంపై స్పందించారు.
పదేళ్లక్రితం బ్రహోత్సవాల్లో భాగంగా భక్తులు నాణేలు విసరటం వల్ల హారంలోని గులాబీ రంగు వజ్రం పగిలిపోయిందని ఆనాడు ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులు.. భద్రతా పర్యవేక్షణాధికారిగా ఉన్న తనకు స్వయంగా రాసిచ్చారన్నారు.
తదనుగుణంగా ప్రభుత్వానికి తాను నివేదిక అందించానన్నారు. అయితే ఆ తర్వాత ఏర్పాటు చేసిన జగన్నాథరావు కమిటీ అది వజ్రం కాదు రూబీ అని తేల్చిందన్నారు. కమిటీ నివేదిక సమర్పణ సమయంలో ఏమీ మాట్లాడని రమణ దీక్షితులు ఇప్పుడు పదేళ్ల తర్వాత ప్రస్తుత వ్యవస్థపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు.