సమీక్షలు జరిపి తీరతానని మంత్రి సోమిరెడ్డి సవాల్.. అడ్డుకుంటే సుప్రీం కోర్టుకెళతారట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలపై రగడ జరుగుతున్న వేళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమీక్షలు జరిపి తీరుతానని , ఎవరైనా అడ్డు వస్తే అప్పుడు చెప్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై చంద్రబాబు సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేంద్రప్రభుత్వం సమీక్షలు నిర్వహించొచ్చు, తెలంగాణ సీఎం సమీక్షలు చెయ్యొచ్చు కానీ ఏపీ సీఎం మాత్రం సమీక్షలు నిర్వహించకూడదా ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు మంత్రి సోమిరెడ్డి.
సమీక్షలపై రాద్దాంతం వైసీపీ కుట్రే అంటున్న మంత్రి సోమిరెడ్డి
ఉండవెల్లి ప్రజావేదిక మీడియా పాయింట్లో మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షలపై జరుగుతున్న రాద్దాంతంపై తనదైన శైలిలో స్పందించారు. సమీక్షలపై జరుగుతున్న రచ్చ వైసీపీ చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు .వైసీపీ పార్టీ పై తీవ్రమైన విమర్శలు గుప్పించిన మంత్రి ఓటమి భయం తో వైసీపీ కొత్తపోకడలకు పోతుందని విమర్శించారు . రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తో కాకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధానిధికారి గోపాలకృష్ణ ద్వివేది, మరియు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ల పాలన కొనసాగించాలని వైసీపీ కోరుకుంటుందని మంత్రి సోమిరెడ్డి విమర్శలు చేశారు. అందుకే ప్రతీదీ రాద్దాంతం చేస్తుందని ఆయన అన్నారు.
సమీక్షలు జరిపి తీరుతాం .. అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళతాం
ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే సమీక్షలపై ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారన్నారు సోమిరెడ్డి . వ్యవసాయ శాఖామంత్రిగా తాను వ్యవసాయ శాఖపై సమీక్షలు చేస్తానని స్పష్టం చేశారు. తన సమీక్షను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఒక వ్యవసాయశాఖ మంత్రిగా ఉండి, రైతులు ఇంతలా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. పదవిలో ఉన్నంత వరకు ప్రజలకు ఆందుబాటులో ఉంటామని సోమిరెడ్డి అన్నారు.
జగన్, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఏపీ ప్రభుతం పని చేస్తుందన్న మంత్రి సోమిరెడ్డి
ప్రభుత్వం యథాతథంగా పనిచేస్తోందని ఈసీ చెప్పిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి గుర్తు లేదేమోనని సెటైర్లు వేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలంగాణా సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ కలిసి ఏపీ ప్రభుత్వంపై , చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని పేర్కొన్న సోమిరెడ్డి ఎట్టి పరిస్థితిలోనూ సమీక్షలు నిర్వహిస్తామని తెగేసి చెప్పారు.