సచివాలయం సాక్షిగా : సోమిరెడ్డికి భంగపాటు : రాజీనామా మాట నిలబెట్టుకుంటారా..!
ఏపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డికి సచివాలయం సాక్షిగా భంగపాటు ఎదురైంది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఆదేశాలు అమలు కాలేదు. మంత్రి వచ్చి కూర్చున్నా..భేఖాతర్ అన్నారు. రెండు గంటలు ఎదురు చూసారు. ఎవరూ స్పందించలేదు. ఎన్నికలతోనే తమ పదవీ..అధికారం ముగిసిపోయిందని డిసైడ్ అయ్యారు. నెమ్మదిగా అక్కడ నుండి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు..గతంలో చెప్పిన విధంగా రాజీనామా మాట నిలబెట్టుకుంటారా
సోమిరెడ్డి చెప్పినా బేఖాతర్..
వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి భంగపాటు ఎదురైంది. సచివాలయంలో ఆయన పేషీలోనే రెండు గంటల పాటు నిరీక్షించారు. కానీ, ఫలితం రాలేదు. ఏపిలోని కరువు..తుఫాను ప్రభావంపై సమీక్షకు రావాలని ఈ సమావేశం ఈనెల 30వ తేదీన ఏర్పాటు చేసామని ముందుగానే అధికారులు మంత్రి కార్యాలయం నుండి సూచనలు పంపారు. దీని కోసం మంత్రి సమీక్షకు సిద్దమై సచివాలయానికి చేరుకున్నారు. కానీ, అధికారులు మాత్రం రాలేదుద. వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు అయిన కమిషనర్ మురళీధర్రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ సైతం సమీక్షకు గైర్హాజరయ్యారు. చిత్తూరులో నిర్వహించే జిల్లా వ్యవసాయ శాఖ సమీక్ష నేపథ్యంలో హాజరు కాలేమని వారు మంత్రికి సమాచారం పంపారు. దీంతో..దాదాపు రెండు గంటల పాటు వేచి చూసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సచివాలయం నుండి వెనుతిరిగారు.
గతంలో రాజీనామా హెచ్చరిక..
ఎన్నికలు పూర్తయిన తాము మంత్రులుగా ఉన్నామని..సమీక్షలకు అనుమతి లేకుంటే తమకు ఈ పదవులు అవసరం లేని కొద్ది రోజుల క్రితం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. వ్యవసాయం పై తనను సమీక్ష చేయనీయకుంటే తనకు పదవి అవసరం లేదని..రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అయితే, ఇప్పుడు అధికారులు మంత్రి కార్యాలయం నుండి సమాచారం ఇచ్చినా..మంత్రి సచివాలయంలోనే ఉన్నారని తెలిసినా..ఆయన వద్దకు రాలేదు. సమీక్షకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రి సమీక్షలకే అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రే సమీక్షలు రద్దు చేసుకున్నారు. ఎన్నికల సంఘం..సీఎస్..సీఎం మధ్య నలిగిపోతున్న అధికారులు ఎన్నికల సంఘం..సీఎస్ మాటకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో..సోమిరెడ్డి సమీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో..ఇప్పుడు సోమిరెడ్డి తాను గతంలో చెప్పినట్లుగా రాజీనామా చేస్తారా అనే చర్చ మొదలైంది.
మిగిలిన మంత్రులు దూరంగా..
సమీక్షలు..అధికారుల హాజరు గురించి కొద్ది రోజులుగా టిడిపి నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అయినా. సీఎస్..సీఈవో మాత్రం స్పందించ లేదు. అధికారులు ఇబ్బంది పడకూడదనే కారణంగా ముఖ్యమంత్రి సమీక్షలకు దూరంగా ఉంటున్నారు. మిగిలిన మంత్రులు కనీసం సచివాలయానికి కూడా రావటం లేదు. సమావేశం ఉంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక, ఇప్పుడు సోమిరెడ్డి ఏపిలో తుఫాను హెచ్చరికల కారణంతో పాటుగా కరువు ఉండటంతో వీటి పైన సమీక్ష కోసం సిద్దమయ్యారుద. ఇక, అధికారులు మాత్రం తమ బాస్ సీఎస్ చెప్పిన విధంగానే నడుచుకుంటామనే విధంగా మంత్రి సోమిరెడ్డికి షాక్ ఇచ్చారు. మరి..ఇప్పుడు సోమిరెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.