రైతులు సంతోషంగా ఉంటే జగన్ తట్టుకోలేడు...అధికారం కోసం కరువు కోరుకుంటాడు: సోమిరెడ్డి
కర్నూలు: వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ప్రతిపక్షనేత జగన్ పై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సంతోషంగా ఉంటే జగన్ తట్టుకోలేడని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
కరువుతో రైతులు చితికిపోతే, ప్రభుత్వాన్ని తిట్టి ఓట్లు పొందాలనుకునే మనస్తత్వం జగన్ దని మంత్రి సోమిరెడ్డి అభివర్ణించారు. కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన 'రైతు రుణమాఫీ - ఉపశమన అర్హత, పరిష్కార వేదిక'లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి మంత్రి సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికి రుణ మాఫీ చేస్తామని మంత్రి సోమిరెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. బ్యాంకర్ల పొరపాటువల్లే కొందరు రైతులకు అర్హత ఉన్నా రుణమాఫీ జరగలేదని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. పరిష్కార వేదికలో ఈ సమస్యను గుర్తించి పరిష్కరిస్తామని మంత్రి సోమిరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 275 మండలాలను కరువు జాబితాలో చేర్చామని, ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన 37 మండలాలు ఉన్నాయని మంత్రి సోమిరెడ్డి వెల్లడించారు. అయితే ఆగస్టు నెల వర్షపాతం ఆధారంగా కరువు మండలాల జాబితాను పునఃపరిశీలిస్తామని ఆయన వివరించారు.
అనంతరం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ...కర్నూలు జిల్లాలో 4.30 లక్షల మంది రైతులకు రూ.1,713 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని చెప్పారు. అలాగే 9 వేల మంది కౌలు రైతులకు రూ.18 కోట్ల మాఫీ జరిగిందన్నారు. రైతు రథం పథకం కింద 1,822 ట్రాక్టర్లను పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం కెఈ వివరించారు.
మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు సీఎం తెలిపారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయన్నారు. పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించామని సిఎం తెలిపారు.