మంత్రి సోమిరెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం:డ్రైవర్ చాకచక్యం కాపాడింది!
శ్రీకాకుళం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తిత్లీ తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన శ్రీకాకుళం జిల్లాకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
దీంతో వాహనం అదుపుతప్పి డివైడర్పైకి దూసుకెళ్లగా వెంటనే అప్రమప్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనం పెను ప్రమాదానికి గురికాకుండా నిలువరించగలిగాడు. దీంతో మంత్రి సోమిరెడ్డి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం మంత్రి సోమిరెడ్డి మరో వాహనంలో మందస గ్రామానికి బయలుదేరి వెళ్లిపోయారు. అక్కడ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు.
తుఫాన్ విధ్వంసం
మరోవైపు తుఫాన్ విధ్వంసం ధాటికి శ్రీకాకుళం జిల్లాలో అనేక చోట్ల ఎటు చూసినా నేలకూలిన, వాలిపోయిన విద్యుత్తు స్తంభాలు...వేలాడుతున్న...నేలవాలిన వైర్లు ...కనిపిస్తుండటం...దీని ఫలితంగా వందలాది పల్లెల్లోనే కాదు టెక్కలి, ఇచ్ఛాపురం లాంటి ప్రధాన పట్టణాల్లోనూ మూడురోజులుగా గాఢాంధకారమే రాజ్యమేలుతోంది. ఉద్దాన ప్రాంతమైన సోంపేట, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు, కవిటి, కంచిలితోపాటు పాతపట్నం, సంతబొమ్మాళి మండల కేంద్రాల్లోనూ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రజలు చీకట్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవైపు వర్షాలవల్ల పారిశుధ్యం దెబ్బతిని ఈగలు, దోమలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్తు లేకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
సోమిరెడ్డి
తిత్లీ భీభత్సం కారణంగా మొత్తం 4,319 గ్రామాలు అంధకారంలో మునిగిపోగా 2,762 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు శనివారం ప్రకటించారు. 1,557 గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయని అధికారులు చెబుతుండగా...వాస్తవానికి 2,600కుపైగా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 33 కేవీ, 11కేవీ, లోటెన్షన్ వెరసి 23 వేల వరకు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని అధికారులు చెబుతున్నారు. 33 కేవీ వైర్లు 1,358 కిలోమీటర్లు, లోటెన్షన్ వైర్లు 5,316 కిలోమీటర్లు, 11 కేవీ వైర్లు 3,102.7 కిలోమీటర్ల మేరకు తెగిపోయాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
టెక్కలి నుంచి
వీటన్నింటినీ సరిచేసి అన్ని ఆయా ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించడానికి ఎన్ని రోజులు పడుతుందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. టెక్కలి నుంచి పలాస మధ్య టవర్లు 5, పలాస-ఇచ్ఛాపురం మధ్య ఒకటి కలిపి మొత్తం ఆరు 132 కేవీ టవర్లు పడిపోయాయి. వాటిని సరిచేయడానికి సాంకేతికంగా సమస్యలున్నాయని, అందువల్ల పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఎప్పటిలోగా పునరుద్ధరించగలమనేది చెప్పేందుకు కొంతసమయం పడుతుందని ఒక ఉన్నతాధికారి ఆఫ్ ద రికార్డు చెప్పారు.
సూర్యప్రతాప్
అయితే కూలిపోయిన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన వేరే స్తంభాలు ఏర్పాటుచేసి, వైర్లు సరిచేసి వీలైనంత త్వరగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శేషుకుమార్, జనరల్ మేనేజరు(ఆపరేషన్స్) సూర్యప్రతాప్ మీడియాకు తెలిపారు.