గుంటూరు: మద్యం మత్తులో లేడీస్ హాస్టల్ ఎదుట ఏపీ మంత్రి తనయుడి వీరంగం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఓ కీలక శాఖకు మంత్రిగా ఉన్న ఓ టీడీపీ నేత కుమారుడు ఆదివారం గుంటూరులో నానా భీభత్సం సృష్టించాడు. పుల్లుగ మద్యం సేవించిన మంత్రిగారి కుమారుడు ఒళ్లు తెలియనంత మత్తులో మునిగి సమీపంలోని లేడీస్ హాస్టల్ వద్ద నానా బీభత్సం సృష్టించాడు.
అంతేకాదు మద్యం మత్తులో అతడు ఏకంగా లేడీస్ హాస్టల్లోకి లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో మంత్రిగారి కుమారుడి అరుపులు, కేకలు విన్న స్థానికులు, సమీపంలోని ఓ బాయ్స్ హాస్టల్కు చెందిన యువకులు అక్కడికి చేరుకున్నారు.
ఇంకేముంది మంత్రిగారి తనయుడితో స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో హాస్టల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మంత్రి గారి కుమారుడిని బాయ్స్ హాస్టల్ యువకులు అడ్డుకున్నారు. అయినా సరే మంత్రిగారి కుమారుడు వినకపోవడంతో చేసేదేమి లేక ఆ యువకులు నేరుగా పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకేముందు మంత్రిగారి కుమారుడిని చూసి చేసేదేమీ లేక మందలించి ఇంటికి పంపారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే లేడీస్ హాస్టల్ ముందు రాత్రి సమయంలో నానాయాగి చేసిన సదరు మంత్రి గారి తనయుడి పేరుగాని, మంత్రిగారి పేరుగానీ బయటకు రాకపోవడం విశేషం.
గతంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఏపీ మంత్రి రావెల కిషోర్బాబు కుమారుడు రావెల సుశీకుమార్, అతడి డ్రైవర్ రమేష్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.