పేరూరు డ్యాం కూలీగా పనిచేసిన మంత్రి పరిటాల సునీత
అనంతపురం:2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రజాప్రతినిధులను ఎలక్షన్ ఫీవర్ ఆవరిస్తోంది. రాజకీయ నేతలు మిగతా సమయమంతా ఎలా ఉన్నా ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నించడం సర్వసాధారణం.
ఆ క్రమంలో మిగతా ప్రజాప్రతినిథుల కంటే ఒకడుగు ముందే ఉన్నారు మంత్రి పరిటాల సునీత. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి గా ఉన్న ఆమె ఎమ్మెల్యేగా , అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం అనంతపురంలో అన్నా క్యాంటీన్ తనిఖీ సందర్భంగా హల్ చల్ చేసిన మంత్రి సునీత తాజాగా పేరూరు డ్యాం కూలీ అవతారమెత్తి తోటి కూలీలతో మమేకమవడం ద్వారా వారందరి మనసులు గెల్చుకున్నారు.
మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చిరకాల స్వప్నమైన పేరూరు డ్యాం పనులలో పాలుపంచుకోవడం తనకు ఎనలేని సంతోషాన్నిచ్చిందని పరిటాల రవీంద్ర సతీమణి, మంత్రి పరిటాల సునీత ఈ సందర్భంగా చెప్పారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు డ్యాం కాలువ పనులకు శంకుస్థాపన చేయడానికి సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో అక్కడ పైలాన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడి పనులు పర్యవేక్షించేందుకు విచ్చేసిన మంత్రి పరిటాల సునీత కేవలం పనులను పర్యవేక్షించడంతో సరిపెట్టుకోవడం కాకుండా అక్కడ పనిచేస్తున్న కూలీలతో పాటు తానూ ఆ పనుల్లో పాలుపంచుకోవడం అందరినీ ఆకట్టుకుంది.