చంద్రబాబు అబద్ధాలకు కేరాఫ్ అడ్రెస్ .. జనం నమ్మేది జగన్ నే : మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికలలో మొదటి దశ ఎన్నికలు పూర్తికాగా, ఫలితాలు సైతం వచ్చేశాయి. టిడిపి నాయకులు మొదటి దశ పంచాయతీ ఎన్నికలలో తొమ్మిది వందల పైచిలుకు స్థానాలలో టీడీపీ విజయం సాధించిందని, వైసీపీ పతనం తథ్యం అని చెప్తుంటే, తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి 90 శాతం విజయం సాధించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎవరు చెప్పింది వాస్తవమో అర్థంకాని పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారు.
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం విజయం వైసీపీదే : వెల్లంపల్లి
ఇక తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుందని, 90 శాతం విజయం సాధించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు విజయవాడలో 49వ డివిజన్ లో పాదయాత్ర చేస్తున్న ఆయన, ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుని అధికారులకు, ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అటు చంద్రబాబు, ఇటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నిప్పులు చెరిగారు.
చంద్రబాబువన్నీ కుట్రలే .. అయినా ప్రజలు జగన్ వైపే అన్న మంత్రి
చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీదే విజయమని పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పారు. చంద్రబాబునాయుడు అబద్ధాలకు కేరాఫ్ అని మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారని చెప్పిన వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు చెప్పే మాటలను ఎవరూ నమ్మరన్నారు .
చంద్రబాబుపై విరుచుకుపడిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఇక ఇదే సమయంలో విజయవాడ గాంధీనగర్ 36వ డివిజన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు, చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రజలు ఓట్ల ద్వారా వాళ్లకు బుద్ధి చెబుతున్నారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలకు సరైన గుణపాఠం ప్రజలు నేర్పిస్తున్నారు అని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు.