సినిమాల్లో వకీల్ సాబ్,బయట పకీర్ సాబ్..పవన్ రాజకీయాలకు పనికిరాడన్న మంత్రి వెల్లంపల్లి
నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం సాబ్, అయ్యా .. బాబు, సీఎం గారు అంటే మాట వినేలా లేరని రైతులకు నివర్ పరిహారం చెల్లించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను జరగనివ్వం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు విరుచుకుపడుతున్నారు.
పవన్ పర్యటన సినిమా ప్రమోషన్ లా ఉందన్న మంత్రి వెల్లంపల్లి
సినిమాల్లోనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అని బయట మాత్రం పకీరు సాబ్ అంటూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేశారు . సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని మండిపడ్డారు. పవన్ పర్యటన ఒక సినిమా ప్రమోషన్ లా ఉందంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కృష్ణా జిల్లా టూర్ పై వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడని , పవన్ సినిమాల్లో పేమెంట్ తీసుకుని ఎలా నటిస్తున్నారో రాజకీయాల్లో కూడా అలానే నటిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్
అంతేకాదు బాబు ప్యాకేజీ కి అమ్ముడు పోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మండిపడిన మంత్రి వెల్లంపల్లి రైతుల పట్ల పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు అసెంబ్లీ ముట్టడిస్తామని పేర్కొన్న పవన్ కళ్యాణ్ కు అసలు అసెంబ్లీ ఎక్కడుందో తెలుసా అంటూ ప్రశ్నించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇక జయంతి వర్ధంతి తేడా తెలియని నారా లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నా సరే అనుకున్నది సాధించిన జగన్
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీలో సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కితాబిచ్చారు. సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు అందించి పేద ప్రజలకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోలేక పోయారని , కొంతకాలం వాయిదా పడినప్పటికీ సీఎం జగన్ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారని, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రుల ఫైర్ .. ఘాటు వ్యాఖ్యలు
వైయస్సార్ హయాంలో పేదలు ఎంత సంతోషంగా ఉన్నారో ,ఆయన తనయుడు జగన్ పాలనలో కూడా ప్రజలు రెట్టింపు సంతోషంతో ఉంటారని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. మరో వైపు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కొడాలి నానీతో పాటు మంత్రి పేర్ని నానీ కూడా పవన్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు . ఘాటుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు . సీఎం జగన్ కూడా పవన్ టూర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.