వినాయక చవితి ఉత్సవాలపై మాటల రగడ..చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామ..మంత్రి విసుర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే వినాయక చవితి నిర్వహించుకోవాలని, వినాయక విగ్రహాలు, వినాయక మండపాలు పెట్టడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయంపై రగడ నెలకొంది.
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలన్న రఘురామ
వినాయక నవరాత్రి వేడుకల అంశంపై కొనసాగుతున్న రగడ లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఏ విధంగా అయితే నిబంధనలతో కూడిన అనుమతి ఇస్తున్నారో , అదేవిధంగా వినాయక చవితి వేడుకలకు కూడా అనుమతి ఇవ్వాలని , హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడుకోవాలని లేఖ ద్వారా తెలియజేశారు. లేఖలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను టార్గెట్ చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల సీఎం జగన్ కు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని రఘురామ వ్యాఖ్యానించారు.
రఘురామ వ్యాఖ్యలకు వెల్లంపల్లి కౌంటర్
రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లలోనే పండుగలను నిర్వహించుకోవాలని సూచించాయని పేర్కొన్నారు. దీనిని కూడా తప్పు పట్టడం దారుణమని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి. ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన ఆయన వైఎస్సార్ కుటుంబాన్ని ఏ ఒక్క కులానికో మతానికో అంటగట్టడం మంచిది కాదని పేర్కొన్నారు.
చంద్రబాబు డైరెక్షన్ లో రఘురామ మాట్లాడుతున్నారని విమర్శలు
చంద్రబాబు డైరెక్షన్లో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారని, హైదరాబాద్లో కూర్చొని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.వినాయక విగ్రహాలు వీధుల్లో పెట్టరాదని నిర్ణయానికి ముందుగానే అన్ని పార్టీల నాయకులతో మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సంఘాలతో చర్చించామని ఆయన తెలిపారు. ఢిల్లీలో కూర్చుని మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజు,నియోజకవర్గంపై అంత ప్రేముంటే నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రి వెల్లంపల్లి సవాల్ విసిరారు.
ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో కూర్చొని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, గత ఐదు నెలలుగా సొంత నియోజకవర్గానికి రాకుండా తిరుగుతున్న రఘురామ ఇప్పటికైనా సొంత నియోజకవర్గానికి వచ్చే వినాయక చవితి వేడుకల్లో పాల్గొనాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.