అసెంబ్లీ సీట్ల పెంపుపై వెంకయ్య: పెంచితే తెలుగు రాష్ట్రాలకు వచ్చే సీట్లివే
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ, శాసనసభ కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై స్పందించారు.
ఏపీలోని అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కు, తెలంగాణలో 153కు వరకు శాసన సభ స్ధానాలను పెంచే విషయంపై హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా చర్చించి నట్టు వెంకయ్య తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కరీంనగర్ ఎంపీ వినోద్ సోమవారం తనతో సమావేశమైనట్టు వెల్లడించారు.
న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఈ వ్యవహారంపై చర్చిస్తున్నామని వెంకయ్య తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసేందుకు హోం శాఖతో పాటు ఆర్థిక, రెవెన్యూ, న్యాయ శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు.
అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటే చర్చల తర్వాత హోంశాఖ నుంచి ప్రతిపాదనలు పంపాల్సి ఉందని, ఆ తర్వాత న్యాయశాఖ దాన్ని పరిశీలించి అటార్నీ జనరల్కు పంపుతుందని, ఆయన సిఫార్సు మేరకు న్యాయ శాఖ మద్దతు తెలుపుతూ హోంశాఖకు పంపాల్సి ఉందని అన్నారు.
ఆ తర్వాత ఆంధ్రప్రేదేశ్ విభజన చట్టంలో మార్పులను పార్లమంట్లోని ఉభయ సభల్లో ఆమోంద పొందిన తర్వాతే అసెంబ్లీల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో హోంశాఖ నుంచి న్యాయశాఖకు అభిప్రాయాన్ని కోరుతూ రాతపూర్వక లేఖ వెళ్లే అవకాశం ఉందని వెంకయ్య పేర్కొన్నారు.
పార్లమెంట్ రెండో దశ బడ్జెట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.