నాలుక అదుపులో పెట్టుకో... నీ విలువ అప్పుడే దిగజారిపోయింది... మాజీ ఎంపీకి మంత్రి వార్నింగ్...
'వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ పథకం ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారు. అసలు దళిత ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉందా?' అంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పినిపే విశ్వరూప్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడినప్పుడే హర్ష కుమార్ విలువ దిగజారిందని విమర్శించారు. ఇదే కులంలో పుట్టి ఉంటే శిరోముండనం ఘటనను ఖండించండి అంటూ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.
దళితుల పుట్టుక గురించి హర్ష కుమార్ దారుణంగా మాట్లాడుతున్నారని.. నాలుక అదుపులో పెట్టుకోవాలని విశ్వరూప్ హెచ్చరించారు. దళిత పులి అని చెప్పుకుని తిరిగే హర్షకుమార్... రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతకైనా దిగజారుతారని,జాతిని తాకట్టు పెడుతారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులకు అన్ని విధాలా పెద్ద పీట వేశారని... వరప్రసాద్ శిరోముండనం కేసులోనూ వెంటనే స్పందించి చర్యలకు ఆదేశించారని గుర్తుచేశారు. హర్ష కుమార్ ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
ఈ ఘటనకు సంబంధించి సీఐ, డీఎస్పీ, ఎస్పీలను కూడా సస్పెండ్ చేయాలని హర్ష కుమార్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దళితులలో పెయిడ్ బ్యాచ్కు తాను సవాల్ చేస్తున్నానని.. మీకు సిగ్గు ఉంటే, ఇదే కులంలో పుట్టి ఉంటే పార్టీ ముసుగులు తొలగించి స్పందించాలని డిమాండ్ చేశారు.
కాగా,తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన దళిత యువకుడికి శిరోముండనం కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది.ఈ నెల 18వ తేదీ రాత్రి 9.30 గంటలకు మునికూడలి వద్ద ఓ ఇసుక లారీ ఓ దళిత యువకుడిని ఢీకొట్టడంతో ఈ వివాదం మొదలైంది. కొంతమంది యువకులు ఆ లారీని అడ్డుకుని డ్రైవర్తో వాగ్వాదానికి దిగగా రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
Recommended Video
అదే సమయంలో కారులో అటుగా వచ్చిన వైసీపీ నేత కవల కృష్ణమూర్తి పదేపదే హారన్ కొట్టడంతో దళిత యువకులు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో ప్రసాద్ అనే యువకుడు కారు వద్దకు వెళ్లడం.. అదే సమయంలో కృష్ణమూర్తి కారు డోర్ తీయడంతో అతని చేతికి గాయమైందన్న వాదన ఉంది. దీంతో ఆగ్రహించిన ప్రసాద్ కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో ప్రసాద్పై ఆగ్రహంతో రగిలిపోయిన కృష్ణమూర్తి అతనిపై కేసు పెట్టగా... పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అతన్ని తీవ్రంగా కొట్టి శిరోముండనం చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.