జగన్ మీడియాకు యనమల షాక్: సాక్షికి యాడ్స్ ఇవ్వరా? పునఃసమీక్షిస్తామని ప్రకటన..
సాక్షి మీడియాకు యాడ్స్ ఇచ్చే విషయాన్ని పునఃసమీక్షిస్తామని ఏపీ మంత్రి యనమల తెలిపారు.ప్రెస్ కౌన్సిల్ గైడ్ లైన్స్, జర్నలిజం విలువలు పాటించని సాక్షి మీడియాకు ఈ రోజు వరకూ యాడ్స్ ఇచ్చామన్నారు.
అమరావతి: సాక్షి మీడియా అంటే టీడీపీకి, ఆంధ్రజ్యోతి అంటే వైసీపీకి ఎంతటి ద్వేషం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి మీడియా సమావేశాలకు కూడా ప్రత్యర్థి అనుకూల మీడియాను అనుమతించని సందర్బాలు చాలానే ఉన్నాయి.
సభలు, సమావేశాల్లోను ఇరు పార్టీల నాయకులు తమ ప్రత్యర్థి మీడియాను బాహాటంగానే విమర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు సాక్షి మీడియాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాక్షి మీడియాకు యాడ్స్ ఇచ్చే విషయమై ఇకపై పునఃసమీక్షించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రెస్ కౌన్సిల్ గైడ్ లైన్స్, జర్నలిజం విలువలు పాటించని సాక్షి మీడియాకు ఈ రోజు వరకూ యాడ్స్ ఇచ్చామని, ఇకపై ఆలోచిస్తామని యనమల అన్నారు. సాక్షి మీడియా ద్వారా పెద్ద ఎత్తున అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక వైసీపీ అధినేత జగన్.. ప్రతిపక్ష నేతగానే కాదు, అసలు రాజకీయాలకే ఆయన తగిన వ్యక్తి కాదని విమర్శించారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేయడంలో హిట్లర్, గోబెల్స్ ను జగన్ మించిపోయాడని విమర్శించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల జప్తు చేసిన రూ.18 వేల కోట్లు జగన్కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.