ధైర్యం ఉంటే ఢిల్లీలో బంద్ చేయండి:వైసిపిపై మండిపడ్డ మంత్రి యనమల రామకృష్ణుడు
Recommended Video
అమరావతి:ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసిపి నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్పై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో వైసిపి చేస్తున్న బంద్ వల్ల అనేక రకాలుగా నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, పిల్లల చదువులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారని యనమల వివరించారు. అసలు వైకాపా బంద్ పిలుపు వెనుక ఉద్దేశం రాష్ట్రంలో అలజడి సృష్టించడమేనని యనమల ఆరోపించారు. వైకాపా తన ఎంపీలతో రాజీనామా చేయించి లోక్సభ వేదికనే కోల్పోయిందన్నారు. తద్వారా అవిశ్వాసంపై ఓటింగ్లో పాల్గొనకుండా భాజాపాకి వైసీపి లబ్ది చేకూర్చిందని ఆరోపించారు.
వైకాపానే రాష్ట్రానికి చేయాల్సిన నష్టం అంతా చేసిందని యనమల మండిపడ్డారు. రాష్ట్రానికి ఎనలేని నష్టం కలిగించడమే కాకుండా ఇప్పుడు బంద్ ద్వారా మరింత నష్టం చేస్తోందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే వైకాపా ఇలా బంద్ చేస్తోందని యనమల దుయ్యబట్టారు. ఇలా వివిధ రకాలుగా పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రాకుండా చేసి...రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిని దెబ్బతీసేందుకే వైకాపా నాటకాలు ఇలా బంద్ ల నాటకాలు ఆడుతోందన్నారు.
అసలు వైకాపా నేతలకు ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి బంద్ చేయాలని మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ బంద్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంపై పోరాటం ఢిల్లీలో చేయాలి గాని రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏమిటని మంత్రి యనమల నిలదీశారు. మరోవైపు రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు అమలు చేయకుండా ఏపీకి బిజెపి తీరని అన్యాయం చేసిందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.