సీఎం మా వద్దే ఉండాలి..కేబినెట్ లో మంత్రుల భిన్నవాదన: అమరావతిపైనా..: జగన్ జోక్యంతో..!
మూడు రాజధానులు..అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు పైన ఏపి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎక్కడా మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు రాలేదు. కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం విషయంలో మాత్రం మంత్రులు మా వద్దే ఉండాలంటే..మా వద్దే ఉండాలంటూ వాదించుకున్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి జోక్యంతో చర్చకు ముగింపు ఇచ్చారు. అయితే, వారికి మాత్రం సీఎం స్పష్టత మాత్రం ఇవ్వలేదు.
ఇదే కేబినెట్ సమావేశంలో మూడు రాజధానులకు సంబంధించిన నిర్ణయానికి ఆమోద ముద్ర వేసారు. అదే విధంగా సీఆర్డీఏ చట్టం రద్దుకు..అమరావతి రైతులకు ప్యాకేజి పెంపు వంటి వాటి మీద నిర్ణయాలు జరిగాయి. ఇక..అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే నిర్వహించాలనే అంశం మీద మంత్రుల మధ్య భిన్నాభిప్రాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.
సీఎం కార్యాలయం పైన మంత్రులు ఇలా..
రాజధానుల అంశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి వర్గ సభ్యులు..సీఎం కార్యాలయం పైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు తొలి నుండి ప్రతిపాదిం చిన విధంగానే అక్కడే ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదిత బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదే సమయంలో విశాఖలోనే సచివాలయం..రాజ్ భవన్.. ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కార్యాలయాలతో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం సైతం అక్కడే ఉండాలని ప్రతిపాదించారు.
విభేధించిన మంత్రుల
కార్యాలయ తరలింపు, ఏర్పాటు అంశాలపై అమరావతి జిల్లాల మంత్రులు విభేదించినట్లు సమాచారం. విశాఖతో పాటుగా అమరావతిలోనూ సీఎం కార్యాలయం ఏర్పాటు చేయాలని వాదించారు. దీని పైన మంత్రుల మధ్య వాదన సాగినట్లు తెలుస్తోంది. దీంతో..సీఎం జగన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీని పైన తర్వాత నిర్ణయం తీసుకుందామంటూ ముఖ్యమంత్రి ఆ చర్చకు ముగింపు పలికారు.
అమరావతిలో అసెంబ్లీ పూర్తిగా..
ఇక, ఇదే సమావేశంలో అమరావతి రైతులకు అదనపు ప్రయోజనం కల్పించాలని నిర్ణయించారు. ఎకరానికి అదనంగా 200 గజాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులకు ఇచ్చే పెన్షన్ రూ.5వేలకు.. కౌలును 15ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు జోన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టర్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతిలోనే మూడు సెషన్లు
అలాగే అసెంబ్లీ మూడు సెషన్లు అమరావతిలోనే జరగాలని పలువురు మంత్రులు సూచించారు. ఈ నిర్ణయాన్ని కొంతమంది మంత్రులు వ్యతిరేకించారు. కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో.. తర్వాత నిర్ణయిద్దామని సీఎం జగన్ చెప్పారు. దీంతో ఆ వాదనకు ఫుల్స్టాప్ పడినట్లు తెలుస్తోంది. అయితే, బిల్లులో మాత్రం శాసన రాజధానిగా అమరావతిని ప్రతిపాదిం చిన ప్రభుత్వం..అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా అమరావతిలోనే నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అసెంబ్లీ..మండలిలో ఆమోదం పొందాల్సి ఉంది.