ఉన్మాది, దౌర్జన్యకారుడు.. జగన్లో 2 కోణాలు: దుమ్మెత్తిపోసిన మంత్రులు
హైదరాబాద్: అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాదిగా ప్రవర్తించిందని, లోపల ఓ జగన్, బయట ఓ జగన్ ఉంటారని మంత్రులు అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్ రెడ్డిలు శుక్రవారం నాడు మండిపడ్డారు. సభ వాయిదా పడిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
ఉన్మాది ప్రవర్తన: అచ్చెన్నాయుడు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు అసెంబ్లీలో ఉన్మాదులుగా ప్రవర్తించారని మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసిపి సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. సభలో వైసిపి సభ్యుల తీరు విచారకరమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దన్నారు. సభా సమయాన్ని వృథా చేయడమే కాకుండా, ఎదురు దాడికి దిగుతున్నారన్నారు.
అసెంబ్లీలో రౌడీల్లా, ప్యాక్షనిస్టుల్లా ప్రవర్తించిన వైసిపి', 'మార్షల్స్ దాడి'
ఏ అంశం పైన అవసరమైతే అర్ధరాత్రి రెండు గంటల వరకు అయినా చర్చిద్దామన్నారు. ప్రతిపక్షం ఎంత చేసినా, మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఊరుకుంటున్నామన్నారు. తాము చర్చించేందుకు సిద్ధమన్నారు. ఇప్పటికైనా ముందుకు రావాలన్నారు. లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోను తప్పు పట్టలేదన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను సీఎం చంద్రబాబు స్వాగతించారని జగన్ అవాస్తవాలు చెబుతున్నారన్నారు. కేంద్రం రెండున్నరేళ్లుగా చేసిన సాయాన్ని మాత్రమే తాము స్వాగతించామన్నారు.
హోదాను వదలమని, అలాగే కేంద్రం ఇచ్చిన సహాయాన్ని తీసుకుంటామన్నారు. కేంద్రం ఇచ్చిన సాయాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఉపయోగించాల్సి ఉందన్నారు. వైసిపి సభ్యుల తీరును ప్రతిపక్షాలు అసహ్యించుకుంటున్నాయన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు.
దౌర్జన్యకారుడు: జగన్ పైన పల్లె
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సభా సంప్రదాయాల పైన నమ్మకం లేదని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. తెలియని వారికి చెబితే అర్థమవుతుంది, తెలిసిన వారికి అర్థమవుతుంది, తెలిసీ తెలియని వారికి చెబితే ఏదీ అర్థం కాదనే సామెత ఉందని, అది వైసిపికి వర్తిస్తుందన్నారు. జవాబుదారి లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు.
ఓ దౌర్జన్యకారుడు, ఓ ప్రతిపక్ష నేత ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉందన్నారు. వైసిపి సభ్యుల తీరు చాలా అవమానకరంగా ఉందన్నారు. హోదా పైన తాము చర్చిద్దామని చెప్పినా, తిరిగి ఎదురు దాడి చేయడం విడ్డూరమన్నారు. హోదా పైన జగన్కు ఎంత చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టే అర్థమవుతోందన్నారు.
జగన్లో రెండు కోణాలు
జగన్లో రెండు రూపాలు ఉంటాయన్నారు. ఒకటి లోపల ఉంటుందని, రెండోది బయట ఉంటుందన్నారు. బయట ఉండే జగన్ కల్లిబొల్లి మాటలు చెబుతారని, రాష్ట్రం బాగుండాలని చెబుతారన్నారు. లోపల ఉండే జగన్ మాత్రం రాష్ట్రం నష్టపోవాలని కోరుకుంటారన్నారు.
హోదా పైన తాము తగ్గేది లేదన్నారు. కేంద్రం ఇచ్చింది తీసుకుంటామని, అలాగే మన హక్కుల కోసం డిమాండ్ చేస్తామని చెప్పారు. రాజకీయ ఉనికి కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిగా వ్యవహరిస్తోందన్నారు. ఎవరికో భయపడటం నారా వారి ఇంటా వంటా లేదన్నారు.
ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధం: పత్తిపాటి
హోదా పైన తాము ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమని మంత్రి పత్తిపాటి పుల్లా రావు అన్నారు. స్పీకర్ పైన దాడికి యత్నం, కుర్చీలు ఎక్కడం.. ఇది ఏమిటన్నారు. అసెంబ్లీ సమావేశాల చరిత్రలో ఇది బ్లాక్ డే అన్నారు. చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదన్నారు.
హోదా పైన చర్చించేందుకు వైసిపి నేతలకు ఇష్టం లేదన్నారు. ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞతలు చెబుతారని, అదే చంద్రబాబు చేశారన్నారు. కానీ హోదా విషయంలో తగ్గేది మాత్రం లేదన్నారు. వైసిపి ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తోందన్నారు. స్పీకర్ మైకు విరిచివేయడం, మార్షల్స్తో వాగ్వాదం ఏమిటన్నారు.
ప్రజాస్వామ్యం పైన వారికి నమ్మకం లేదన్నారు. పదిపదిహేను రోజులు అసెంబ్లీ కావాలని అడుగుతున్నారని, ఎందుకు ఇలా దాడి చేసేందుకు సమావేశాలు కావాలా అన్నారు. జరిగే మూడు రోజులే సద్వినియోగం చేసుకోలేని ప్రతిపక్షానికి పదిహేను రోజులు ఎందుకని ప్రశ్నించారు.
హోదా పైన, నిధుల పైన తాము స్పష్టంగా సభలో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఐదుకోట్ల మంది ప్రజల్లో ఎవరూ నష్టపోకుండా మేం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి ఏ బెనిఫిట్ వచ్చినా టిడిపికి, చంద్రబాబుకు పేరు వస్తుందని వైసిపి భయపడుతోందన్నారు.
తండ్రిని అడ్డం పెట్టుకొని వైయస్ జగన్ నాడు దోచుకున్నారని, అలాంటి ఆలోచన తమకు లేదన్నారు. తమ అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వైసీపీ తీరును తాము ఖండిస్తున్నామన్నారు. జగన్ లేకుంటే సభ జరగవద్దన్న విధంగా వైసిపి తీరు ఉందన్నారు.