గవర్నర్పై చంద్రబాబు షాకింగ్: తెరపైకి 'పవన్ కళ్యాణ్', రెచ్చిపోవడం వెనుక ఆయన!
Recommended Video
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్పై టీడీపీ నేతలు మంగళవారం నిప్పులు చెరిగారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.
అసలు గవర్నర్ వ్యవస్థ ఎందుకని కూడా టీడీపీ నేతలు ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకమని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గవర్నర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన తూరపు గోదావరి జిల్లాలో గవర్నర్ అంశంపై స్పందించారు.
అసలెందుకీ గవర్నర్ వ్యవస్థ!...టిడిపి ఆక్రోశం:ఆ మీటింగ్ తరువాతే
గవర్నర్ అలా పని చేయవద్దని చంద్రబాబు షాకింగ్
అందరినీ గవర్నర్ కలుపుతున్నారని పత్రికల్లో రాస్తున్నారని, గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం పని చేయాలని, అసలా వ్యవస్థ వద్దని టీడీపీ చెప్పిందని, దీనిపై టీడీపీ పోరాడిన సందర్భాలు ఉన్నాయని, ఈ రోజు తాను ఆ విషయాలు మాట్లాడటం లేదు కానీ పత్రికల్లో వచ్చిన విధంగా గవర్నర్ పని చేయడం సరికాదని చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. తద్వారా టీడీపీకి వ్యతిరేకంగా గవర్నర్ వివిధ పార్టీలను కలిసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
గవర్నర్ను మరింత టార్గెట్ చేయాలని నిర్ణయం!
మంత్రులు అచ్చెన్నాయుడు, జవహర్, నక్కా ఆనంద్ బాబు, నారాయణ, జేసీ దివాకర్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావులు కూడా ఈ అంశంపై మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఆయనపై విమర్శల దాడి పెంచాలని టీడీపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత ఆదివారం సీఎం చంద్రబాబుతో గవర్నర్ నరసింహన్ అమరావతిలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని, మరీ వేడి పెంచుతున్నారని బాబుకు హితవు పలికారు. అయితే తమ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని చంద్రబాబు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేతలు గవర్నర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
సీఎంతో భేటీ తర్వాత టీడీపీ నేతల్లో మార్పు
గవర్నరు వ్యవహార శైలిపై టీడీపీ నాయకుల్లో కొన్ని రోజులుగా కొంత అసంతృప్తి, అనుమానాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ వారు బయటపడలేదని అంటున్నారు. సీఎంతో గవర్నరు సమావేశం తర్వాత పార్టీ వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు. హోదా సహా విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం తీవ్రంగా పోరాడుతుంటే గవర్నర్ రాష్ట్రానికి మద్దతివ్వాల్సిందిపోయి, కేంద్రం తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా మాట్లాడారన్న భావన టీడీపీలో కనిపిస్తోంది.
తెరపైకి పవన్ కళ్యాణ్ పేరు
గవర్నర్ నరసింహన్ కేంద్రం కనుసన్నల్లో పని చేస్తున్నారని, టీడీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వంటివారిని రెచ్చగొట్టడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. పవన్కు గవర్నర్ వివిధ సందర్భాల్లో ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం వంటివి దీనికి ఉదాహరణలుగా చెబుతుండటం గమనార్హం.
ఏపీలో మోడీకి దగ్గరి వ్యక్తి నరసింహన్
అసలు గవర్నర్ వ్యవస్థే వద్దన్నది టీడీపీ విధానమని, నరసింహన్ చట్టబద్ధంగా రాష్ట్రానికి చేయాల్సింది చేయడం లేదని, కేంద్రానికి తగిన సమాచారం ఇవ్వడం లేదని మంత్రి నారాయణ విమర్శించారు. నరసింహన్ బాగా బతకనేర్చిన వ్యక్తని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇందిరాగాంధీ హయాం నుంచీ ఆమె కనుసన్నల్లో నడిచేవారని, ఎప్పుడు ఏది మాట్లాడాలో బాగా తెలుసునని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బాగా బతక నేర్చిన వ్యక్తి అని నరసింహన్ను ఉద్దేశించి జేసీ వ్యాఖ్యానించారు. ఏపీలో అందరి కంటే నరేంద్ర మోడీకి దగ్గరి వ్యక్తి కచ్చితంగా నరసింహనే అన్నారు.
విభజనలో గవర్నర్ సూత్రధారి
మంగళవారం నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. పదకొండేళ్లుగా గవర్నర్ నరసింహన్ను కొనసాగించేందుకు మోడీ ప్రభుత్వానికి సిగ్గుందా అని మండిపడ్డారు. ఆయన ఏ ప్రభుత్వంలో నియమితులయ్యారని, కేంద్రానికి తాబేదారుగా పన ిచేస్తున్నారని, అందుకే కేంద్రంలోని బీజేపీ ఆయనను కొనసాగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న కుట్రకు వారధిగా, సంధానకర్తగా ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. గవర్నర్ గుళ్లు, గోపురాల సందర్శన, ప్రోటోకాల్ ఖర్చులకే రూ.కోట్లు ఖర్చు అవుతున్నాయన్నారు. రాష్ట్ర విభజనలో ఆయనే ప్రధాన పాత్రధారి అన్నారు. గవర్నర్ వ్యవస్థకు కళంకం తెస్తూ రాజకీయ పార్టీలను కలవడంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడమే ఆయన విధి అని, దానిని హైకోర్టు న్యాయమూర్తి అయినా చేయించగలరన్నారు.
గవర్నర్ పిలిచి మాట్లాడాకే టీడీపీని తిట్టేందుకు పవన్ సభ
గవర్నర్ అసలు స్వరూపం బయటకు వచ్చిందని నక్కా ఆనంద బాబు అన్నారు. అందువల్లే ఆయనపై మా సీఎం బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమిత్ షా, నరేంద్ మోడీ మాఫియాలా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని సీఎం చెబుతున్నారన్నారు. నిన్నటి వరకు మా వైపు ఉన్న పవన్ కళ్యాణ్ గవర్నర్ పిలిచి మాట్లాడాకే తమను తిట్టడానికి సభ పెట్టారని వ్యాఖ్యానించారు. ఇవి తన వ్యక్తిగత వ్యాఖ్యలు అన్నారు. పవన్తో గవర్నర్ నరసింహన్ ఫోన్లో సంప్రదింపులు జరిపారని కూడా కొందమంది టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, గవర్నర్ వ్యవస్థపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని బీజేపీ సోము వీర్రాజు అన్నారు. గవర్నర్ వ్యవస్థను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. బాలకృష్ణ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను పక్కదారి పట్టించుందుకు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు.