సీఎం జగన్తో మంత్రుల భేటీ, ఆ ఎమ్మెల్యేలపై చర్చ, రెండురోజుల్లో పార్టీలో చేరిక..?
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని మరింత బలహీనం చేసేందుకు అధికార వైసీపీ మెల్లిగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలు పదవీకి రాజీనామా చేశాకనే చేర్చుకుంటామని సీఎం జగన్ చెప్పినా.. తొలుత కొందరినీ చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రెండురోజుల్లో వీరు సైకిల్ దిగి.. వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రుల భేటీ..
సీఎం జగన్ విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు మంత్రులు భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో సమావేశమైన మంత్రులు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలపై చర్చించినట్టు తెలుస్తోంది. వారిని పార్టీలోకి ఎలా తీసుకోవాలనే అంశంపై డిస్కస్ చేశారు. పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి సపోర్ట్ చేయాలా ? లేదంటే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలా అనే అంశంపై ఎడతెగని చర్చలు జరిగాయి.
రెండురోజుల్లో..
ఎమ్మెల్యేల చేరికపై సమావేశంలో క్లారిటీ వచ్చిందని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో నేతలు పార్టీలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. సీఎం జగన్తో సమావేశమైన వారిలో మంత్రులు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలం సురేశ్ ఉన్నారు.
సమావేశాల్లోపే..
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలాగా ప్రతిపక్ష టీడీపీకి దెబ్బకొట్టాలని వైసీపీ భావిస్తోంది. ఎమ్మెల్యేల చేరికపై క్లారిటీ వచ్చిందని.. రెండురోజుల్లో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని హామీనిచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేయగా.. యువనేత దేవినేని అవినాష్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
25 నుంచి 20కి..
రాష్ట్రంలో టీడీపీకి 25 సీట్లు రాగా.. ఇప్పటికే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఆ సంఖ్య 20కి చేరుకోనుంది. వాస్తవానికి వైసీపీలోకి వచ్చేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తోన్న.. రాజీనామా చేసి రావాలని జగన్ మెలిక పెట్టడంతో కొందరు మిన్నకుండిపోయారు. వంశీ కూడా సైలంట్ అవడానికి కూడా అదే కారణం అని తెలుస్తోంది. మరీ ప్రకాశం ఎమ్మెల్యేలపై జగన్ ఎలాంటి వైఖరి అవలంభిస్తారన్న అంశం ఆసక్తి కలిగిస్తోంది.