గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో మంత్రులు, ఎంపీల పర్యటన రోజంతా: అక్కడే భోజనం..నిద్ర: భయాన్ని పోగొట్టేలా
విశాఖపట్నం: విశాఖపట్నం వాసులను నిలువెల్లా వణికిస్తోన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతంలో స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలకు పోగొట్టడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించడానికి రాష్ట్ర మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు.. రోజంతా అక్కడే మకాం వేశారు. సోమవారం రాత్రి గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో భోజనం చేశారు. అక్కడే నిద్రించారు. విష వాయువుల ప్రభావం తమపై ఉంటుందనే ఉద్దేశంతో భయాందోళనలకు గురవుతోన్న గ్రామ ప్రజల్లో ధైర్యం కలిగించేలా వారంతా అక్కడే నిద్రించారు.
విశాఖలో భారీగా స్టెరిన్ గ్యాస్ నిల్వలు: ఎల్జీ పాలిమర్స్లో 13 వేల టన్నులు: షిప్పుల ద్వారా తరలింపు
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి, విశాఖపట్నం, అనకాపల్లి లోక్సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, వెంకట సత్యవతి బాధిత గ్రామాల్లో నిద్రించారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల ప్రజల్లో ధైర్యం నింపేలా వారితో మమేకం కావాలని, అక్కడే నిద్రించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వారు దీనికి పూనుకున్నారు.
విజయసాయి రెడ్డి ఆర్ఆర్ వెంకటాపురంలో నిద్రించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉన్నది ఈ గ్రామంలోనే. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సమీపంలో ఉన్న వెంకటాపురంలో రాత్రి భోజనం చేశారు. గ్రామస్తులతో కలిసి మంత్రులు, వైసీపీ పార్లమెంట్ సభ్యులు భోజనం చేశారు. అంతకుముందు- వారంతా గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఎలాాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం అండగా ఉందని వారు భరోసా కల్పించారు.
Recommended Video
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రభావం తగ్గి, గ్రామాస్తులు తమ ఇళ్లకు చేరుకునేంత వరకూ వారికి ఉచిత భోజనం, నివాస సదుపాయాన్ని కల్పించాలని వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం రాత్రి భోజన సౌకర్యాన్ని కల్పించారు. మంత్రులు కూడా అక్కడే భోజనం చేసి, గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో నిద్రించారు. అంతకుముందు విజయసాయి రెడ్డి ఆ అయిదు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలను అందించారు.