సాక్షి పత్రికకు మంత్రులు లీగల్ నోటీసులు, జగన్కు రైతులు షాక్
విజయవాడ: వైసిపి అధినేత జగన్కు చెందిన సాక్షి పత్రికకు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలు లీగల్ నోటీసులు పంపించారు. రాజధానిలో భూములు కొన్నారని తమ పైన అసత్య కథనాలు ప్రచారం చేశారని వీరు సాక్షి మీడియాకు నోటీసులు పంపించారు.
సాక్షి మీడియాపై రైతుల ఫిర్యాదు
రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీల పేరుతో ఇరవై అయిదు వేల ఎకరాలు కాజేశారని సాక్షి పత్రికలో వచ్చిన వరుస కథనాలను రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఏడు గ్రామాలకు చెందిన రైతులు ఖండించారు.
సాక్షి పత్రిక, టీవీ ఛానల్లో అసత్య కథనాలు ప్రచురించి, ప్రసారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించి అశాంతి కలుగచేసేందుకు కుట్ర పన్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామీణ మంగళగిరి పోలీస్ స్టేషన్లో నీరుకొండ, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరు, యర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల రైతులు ఫిర్యాదు చేశారు.
90 శాతం భూమి ఇంకా రైతుల వద్దనే ఉందని తెలిపారు. సాక్షి మీడియాలో వస్తున్న కథనాలతో ఇక్కడ భూముల క్రయ, విక్రయాలు తగ్గిపోయాయని, రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. తుళ్ళూరు మండలంలోని పది గ్రామాల రైతులు సోమవారం రాత్రి తుళ్లూరు పోలీసులకు సాక్షిపై ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వంపై విశ్వాసంతో తామంతా భూములిస్తే వాటిపై సాక్షి పత్రిక వక్రభాష్యం చెబుతోందని ఫిర్యాదు చేశారు. వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, తుళ్ళూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, అనంతవరం, నెక్కల్లు, నేలపాడు, ఐనవోలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు విడివిడిగా ఫిర్యాదులను ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు
ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన భార్యపై అసత్య ఆరోపణలు చేస్తున్న జగన్, వైసిపి నేతలు, తప్పుడు కథనాలు వేస్తున్న సాక్షి మీడియాపై అఖిల భారత దళిత, క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆధ్వర్యంలోని బృందం సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసింది.
రూ.100 కోట్ల పరువు నష్టం దావా: నారాయణ
సాక్షి మీడియా అసత్య కథనాలు ప్రచురించిందని, తనకు భేషరతు క్షమాపణలు చెప్పకుంటే రూ.100 కోట్లకు దావా వేస్తానని మంత్రి నారాయణ చెప్పారు. భేషరతుగా క్షమాపణ చెప్పాలని జగన్, భారతిలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు.
నోటీసులు పంపా: పత్తిపాటి
సాక్షి మీడియాకు తాను నోటీసులు పంపించానని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. తనకు భేషరతు క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని నోటీసుల్లో పేర్కొన్నట్లు చెప్పారు. తన పేరు మీద భూములు ఉన్న విషయం తనకే తెలియదన్నారు. సర్వే నెంబర్లు వేయడం విడ్డూరమన్నారు.