సీఎం జగన్ నిర్ణయానికి మంత్రులు షాక్: అసెంబ్లీలో చివరి నిమిషంలో: తీర్మానం వెనుక వ్యూహం..!
ఏపీ శాసనసభ ప్రత్యేక సమావేశం దాదాపు 12 గంటల పాటు సాగింది. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు.. సీఆర్డీఏ రద్దు బిల్లుల పైన అధికార..ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. ఇక, ముఖ్యమంత్రి మూడు రాజధానుల వెనుక తన ఆలోచనలను..అభిప్రాయాలను సుదీర్ఘంగా వివరించారు. చివరకు మూడు బిల్లుల అమోదానికి సహకరించాలని కోరారు. అదే సమయంలో..ఆకస్మికంగా ముఖ్యమంత్రి సభలో ఒక తీర్మానం ప్రవేశ పెట్టారు. తానే స్వయంగా చదివి వినిపించి..మద్దతివ్వాలని కోరారు. బిల్లుల ఆమోదానికి కొద్ది సేపు ముందే ఆ తీర్మానం ఆమోదం పొందింది. దీంతో..సభలోని సభ్యులే కాదు..కొందరు మంత్రులు సైతం షాక్ అయ్యారు. బిల్లులు ఆమోదం పొందుతున్న సమయంలో ఆకస్మికంగా సీఎం ఈ తీర్మానం ఎందుకు ప్రవేశ పెట్టారనే చర్చ మొదలైంది. అయితే, దీని వెనుక సీఎం జగన్ పెద్ద వ్యూహం రచించినట్లు కనిపిస్తోంది.
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, అవకాశం కల్పించిన సీఎం జగన్కు థాంక్స్: తమ్మినేని
బిల్లుల ఆమోదానికి ముందు సీఎం తీర్మానం..
ఏపీ శాసనసభలో సుదీర్ఘ చర్చ తరువాత ముఖ్యమంత్రి సమాధానం పూర్తయింది. చివరగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుల ఆమోదం సమయంలో ఆకస్మికంగా ముఖ్యమంత్రి సభలో ఒక తీర్మానం ప్రవేశ పెడు తున్నట్లుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా తీర్మానం చదివారు. అందరూ మద్దతివ్వాలని కోరటంతో..సభలోని సభ్యులంతా మద్దతు ప్రకటించారు. దీంతో..స్పీకర్ తొలుత తీర్మానం ఆమోదం పైన ప్రకట న చేసారు. ఆ వెంటనే సభ ఆమోదంతో రెండు బిల్లులు ఆమోదం పొందినట్లుగా స్పీకర్ ప్రకటన చేసారు. అయితే, ముఖ్యమంత్రి చివరి నిమిషంలో ఈ రకమైన తీర్మానం ప్రతిపాదిస్తున్నారనే అంశం ఒకరిద్దరు మంత్రులకు మినహా మిగిలిన వారికి సమాచారం లేదని తెలుస్తోంది. అదే విధంగా ఎమ్మెల్యేలకు తెలియదు. అయితే, ముఖ్యమంత్రి చివరి నిమిషంలో చేసిన ఈ తీర్మానం వెనుక అసలు వ్యూహం ఏంటి.. బిల్లు లు ఆమోదం పొందుతున్న సమయంలో ఈ తీర్మానం అవసరం ఏంటనేది తరువాత మంత్రులకు అర్దం అయింది.
వ్యూహంలో భాగంగానే...
శాసనసభ..శాసన మండలిలో మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం ముందుగానే ఒక వ్యూహం సిద్దం చేసింది. కొందరు మంత్రులకు మాత్రమే దాని పైన సమచారం ఉంది. ప్రభుత్వ వ్యూహం ఏంటనేది కేబినెట్ సమావేశం పూర్తయ్యే వరకు ప్రతిపక్షానికే కాదు..అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం లేదు. ఇక, కేబినెట్ లో ఆమోదం..ఆ వెంటనే సభలో బిల్లులు ప్రవేశ పెట్టటం ద్వారా దీని పైన స్పష్టత వచ్చింది. చివరగా..మూడు రాజధానులపై శాసనసభలో బిల్లు ఆమోదించేశారు. కానీ... ప్రత్యేకంగా ఇదే అంశంపై తీర్మానం కూడా చేశారు. తాము అనుకున్నట్లుగా, ఎలాంటి ఆలస్యం లేకుండా మూడు రాజధానుల నిర్ణయం అమలయ్యేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శాసన మండలిలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందనే దాని పైన ప్రభుత్వం భిన్న కోణాల్లో ఆలోచన చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా..తీర్మానం సైతం సిద్దం చేసుకుంది. అయితే, విషయం చివరి దాకా గోప్యంగా ఉంచారు.
తీర్మానం ద్వారా ముందుకు..
అసెంబ్లీలో సులువుగా ఆమోదం పొందిన బిల్లులకు శాసన మండలిలో చుక్కెదురయ్యే అవకాశముంది. అక్కడ విపక్షానిదే పైచేయి కావడం దీనికి కారణం. అప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వస్తుంది. చట్ట సభల్లో బిల్లును ఆమోదించుకోలేక, ఆర్డినెన్స్ తేవాల్సి రావడం సర్కారుకు ఇబ్బంది కరంగా మారుతుంది. మండలిలో ఈ బిల్లు భవిష్యత్తు ఏమవుతుందన్న దానిపై సర్కారుకు సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులపై ఒక తీర్మానాన్ని ఆమోదించేశారు. మండలిలో బిల్లు అటూఇటు అయినప్పటికీ... అసెంబ్లీ తీర్మానం ఆధారంగా రాజధాని తరలింపును ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీంతో.. ఒక వేళ మండలిలో బిల్లుల ఆమోదానికి ఇబ్బందులు ఎదురైనా.. తాము నిర్ణయించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే ముఖ్యమంత్రి తన వ్యూహంలో భాగంగా అసెంబ్లీలో ఈ తీర్మానం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం టీడీపీలోనూ చర్చనీయాంశంగా మారింది.