కోళ్ల ఫారం యజమానిలా జగన్, అందుకే ఖాళీ: మంత్రులు సునీత, పల్లె ఎద్దేవా
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మెదడు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు.
మంగళవారం అనంతపురంలో జరిగిన టీడీపీ జిల్లా విస్తృత సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తమ ప్రసంగాల్లో వైయస్ జగన్పై విరుచుకుపడ్డారు.
జగన్ పార్టీ ఖాళీ అయిందని.. అందుకే ఖాళీ బిందెలు పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను జగన్ నమ్మలేకపోవడం వల్లే వారు పార్టీని వీడుతున్నారన్నారు. అలాంటప్పుడు ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
జగన్ కోళ్లఫారం యజమాని లాంటివాడని.. గింజలు, నీళ్లు పోసి సాకిన తర్వాత బలి తీసుకోవడం ఆయన నైజమని వ్యాఖ్యానించారు. చివరికు జగన్ తప్ప ఆ పార్టీలో ఎవ్వరూ మిగలరని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో కష్టాలున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలు, నేతలకు మంత్రులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి సునీత రూ.10 లక్షల చెక్కును పార్టీ అధ్యక్షుడుకి అందజేశారు.