చిరంజీవిలా కాదు: చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ బీజేపీ ముసుగు: మంత్రుల ఫైర్
అమరావతి: బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రులు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ధ్వజమెత్తారు.
బాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ బీజేపీ ముసుగు..
పవన్ కళ్యాన్ నిలకడ, నిబద్ధత లేని వ్యక్తని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బీజేపీతో పొత్తే అందుకు నిదర్శనమని అన్నారు. డబ్బులు తీసుకుని రాజకీయాలు చేసే నాయకుడిని తాను ఎక్కడా చూడలేదన్నారు. పవన్ కళ్యాణ్కు సిద్ధాంతాలు, సొంత ఆలోచన, సొంత స్క్రిప్టు ఉండవని మంత్రి వెల్లంపల్లి అన్నారు. పవన్కు పర్మినెంట్ నిర్మాత, డైరెక్టర్ చంద్రబాబు నాయుడేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ బీజేపీ ముసుగు ధరించారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు.
చిరంజీవిలా పవన్ కాదు..
అన్నం పెట్టిన అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ అని వ్యాఖ్యానించారు. చిరంజీవి విజ్ఞతతో ఆలోచిస్తారని.. పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరు డబ్బులిస్తే వారికి వంత పాడుతారని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఒక మాట.. ఇప్పుడు మరో మాట మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్న పవన్.. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు. కుటుంబసభ్యులను కూడా కలుపుకుపోలేని మనస్తత్వం పవన్దని అన్నారు.
బీజేపీలో జనసేన విలీనమే..
పవన్ కళ్యాణ్ త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారని మంత్రి వెల్లంపల్లి జోస్యం చెప్పారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ చేస్తున్న గేమ్ ప్లాన్ ఫలించదని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.
బాబు, పవన్ కళ్యాణ్లకే సాధ్యం..
మరో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పవన్, చంద్రబాబులపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీలు మారడం, పొత్తులు పెట్టుకోవడం ఒక్క చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కే సాధ్యమవుతుందని అన్నారు. మొన్నటి వరకు వామపక్ష పార్టీలతో కలిసి బీజేపీని తిట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అదే పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం ఆయనకే చెల్లుతుందని విమర్శించారు. అన్ని పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకున్నా.. వైసీపీ భయపడదని అన్నారు.