ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో ఈ రాత్రికి బస చెయ్యనున్న మంత్రులు..ఎందుకంటే
వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన, సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. ఇక ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్టదాస్ , అవంతి శ్రీనివాస్, కన్నబాబు తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు . ఇక అధికారులు పరిస్థితి అదుపులోకి వచ్చిందని ,గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల తాజా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష
సంఘటనా స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు ఇచ్చిన సమాచారంతో బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు సీఎం జగన్ . బాధితులంతా కోలుకున్నారని చెప్పటంతో సాయంత్రం లోపు బాధితులను వారి ఇళ్లకు చేర్చాలని, రాత్రికి ఆయా గ్రామాల్లోనే బస చేయాలని సీఎం జగన్ మంత్రులను ఆదేశించారు. ఇక అంతే కాదు నేడు గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది.
విశాఖలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందించిన మంత్రులు
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్లు వైజాగ్ లోనే ఉండి మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఇక ఈ సమయంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ రోజు రాత్రి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రభావిత ఐదు గ్రామాల్లో మంత్రుల బృందం బసచేయనున్నట్టు తెలిపారు మంత్రి కన్నబాబు. బాధిత గ్రామాల ప్రజల్లో మనో ధైర్యం నింపటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు , సీఎం జగన్ అందుకే తమకు ఈ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.
వాలంటీర్ల ద్వారా అందరికీ పరిహారం అందిస్తామన్న మంత్రి కన్నబాబు
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం పంపిణీలో భాగంగా మాట్లాడిన కన్నబాబు పూర్తిగా కోలుకున్నవారిని మాత్రమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక డిశ్చార్జ్ చేసిన వాళ్లకు వెంటనే పరిహారం అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు . ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని వాలంటీర్ల ద్వారా బాధితులందిరికీ ఇస్తామన్న మంత్రి కన్నబాబు ఎవరికీ ఇందులో అన్యాయం జరగదని చెప్పారు. ఇక ఈ పరిహారం కోసం ఎవరి వద్దకు వెళ్లొద్దు అని, మీ ఇంటికే వచ్చి పరిహారం ఇస్తారని చెప్పారు.
Recommended Video
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధిత ఐదు గ్రామాల్లో బస చెయ్యనున్న మంత్రుల బృందం
అంతేకాదు ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లో గ్యాస్ ప్రభావం ఇప్పటికే తగ్గిందని , అయినా ఇంకా కంట్రోల్ చెయ్యటం కోసం , ప్రజారోగ్యం కోసం శానిటైజ్ చేస్తున్నామని పేర్కొన్నారు . ప్రతీ ఇంటిని శానిటైజ్ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని ఇక వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి ఈ రాత్రి ఆ ఐదు గ్రామాల్లో మంత్రుల బృందం బస చేస్తుందని పేర్కొన్నారు మంత్రి కన్నబాబు. ఏది ఏమైనా త్వరితగతిన ప్రభుత్వం విశాఖ బాధితులకు అండగా నిలవటం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.