కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతిచ్చారో తెలుసా..?
ఏప్రిల్ నెలకు సంబంధించి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వివరాలను అందులో పేర్కొంది. దాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ.1892.64కోట్లు విడుదల చేయగా.. తెలంగాణ రాష్ట్రానికి రూ.రూ.982 కోట్లు విడుదల చేసింది.
అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.8255కోట్లు, బీహార్కు రూ.4631కోట్లు,మధ్యప్రదేశ్కు రూ.3630కోట్లు,పశ్చిమ బెంగాల్కు రూ.3461కోట్లు విడుదల చేసింది. అత్యల్పంగా గోవాకు రూ.155కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధుల కేటాయింపు జరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలైన తర్వాత రాష్ట్రాలపై ఆర్థికపరమైన ఒత్తిడి తీవ్రమైంది. ఆదాయ మార్గాలన్నీ దాదాపు మూసుకుపోవడంతో ఖజానాలు ఖాళీ అయిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రాలకు కొంత రిలీఫ్ అనే చెప్పాలి.
2020-21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటాలను నిర్ధేశిస్తూ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో బడ్జెట్లో పొందుపరిచారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల వాటాను 42శాతం నుంచి 41శాతానికి తగ్గించారు. జమ్ము కశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడడం, వాటి భద్రతాపరమైన, ప్రత్యేకమైన అవసరాలకోసం కేంద్రమే నిధులు ఇవ్వాల్సి రావడంతో ఈ ఒకశాతాన్ని తగ్గించినట్టు కేంద్రం గతంలో వెల్లడించింది. రాష్ట్రాలకు 41 శాతం నిధుల పంపిణీ ప్రకారం కేంద్ర పన్నులు, సుంకాల రూపంలో ఏపీకి రూ.32,27.68 కోట్లు, తెలంగాణకు 16,726.58 కోట్లు రావాల్సి ఉంది. కానీ కరోనా సంక్షోభంతో ఈసారి నిధులు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Ministry of Finance has issued sanctions for April instalment of Devolution of States’ Share in Central Taxes and Duties amounting to ₹46,038.10 cr today.
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) April 20, 2020
The inter-se share is as per the recommendations of the XV Finance Commission. #IndiaFightsCorona pic.twitter.com/QdcwNtpov7