ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు: కానీ అంటూ మెలిక పెట్టిన మంత్రి ప్రత్తిపాటి
అమరావతి: దేశంలో కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణలో ఉన్న 10 జిల్లాల సంఖ్యను దసరా నాటికి 27కు పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణలో పెద్ద చర్చే నడుస్తోంది.
ప్రతి పక్షాలు సైతం జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదంటూ నిరాహార దీక్షలు కూడా చేపట్టాయి. ఈ క్రమంలో ఏపీలోనూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలంటూ వస్తున్న వార్తలపై తొలిసారిగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నోరు విప్పారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఉదయం గుంటూరులో వినాయకుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుందన్న వార్తలను ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే జిల్లాల పెంపు అనేది నియోకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే మొదలవుతుందని ఆయన చెప్పడం విశేషం. 2026 వరకు దేశంలో నియోజక వర్గాల పెంపు కుదరని ఎన్నికల సంఘం కుదరదని తేల్చింది.
2019 నాటికి మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి సమీపంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు కానున్న ఎయిమ్స్ 2019 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ నితిన్ నాగార్కర్ పేర్కొన్నారు. ఏపీ విభజనలో భాగంగా ఏపీకి కేంద్రం ఎయిమ్స్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఎయిమ్స్కు ఏపీ ప్రభుత్వం మంగళగిరిలో భూములను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ భూములను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ నితిన్ నాగార్కర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా నాగార్కర్ మీడియాతో మాట్లాడారు.
2019లోగా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు పర్యటించనుంది. ఆరుగురు సభ్యుల కేంద్ర ఉన్నతస్థాయి బృందంలో రాయ్పూర్, న్యూఢిల్లీ ఎయిమ్స్ సభ్యులు పీఎంఎస్ఎస్వై, పీజీఐ ఛండీగఢ్ సభ్యులతో పాటు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి చెందిన ఒకరు ఉన్నారు.