నదిలో బోట్లు ఢీ: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం, సునీతకు కూడా
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. పుష్కర ఘాట్ల పర్యవేక్షణకు బాబు లాంచిలో వెళ్లారు. మీడియా బోటు చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని ఢీకొట్టింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అనుభవం లేని డ్రైవర్లు బోట్లను నడిపినందు వల్లే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం చంద్రబాబు దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక బోటులో గోదావరి పర్యటించి పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనకు ఇరిగేషన్ శాఖ రెండు బోట్లను ఏర్పాటు చేసింది.
ఓ బోటులో సిఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మరో బోటులో మీడియా వెళ్లింది. టూరిజం బోటు ప్రాంతం నుంచి విఐపి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీ ఘాట్లను పరిశీలించి కొవ్వూరు తిరుగు పయనం అవుతున్న సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని మీడియా లాంచ్ ఢీకొట్టింది.
దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మీడియా బోటు స్వల్పంగా దెబ్బతింది. కోటి లింగాల రేవు ఘాట్ వద్ద కూడా సీఎం లాంచి మట్టిలో చిక్కుకొని ఓవైపు ఒరిగిపోయింది.
మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ను ఢీకొన్న కారు
ఏపీ మంత్రి పరిటాల సునీతకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంత్రికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.