ఏపీ విభజన చట్టంలో కొన్ని సవరణలు...కారణం ఇదే!
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్-2014 లో ఉన్న కొన్ని ముద్రణ దోషాలను సరి చేసేందుకే ఈ సవరణలు చేయడం జరిగింది.
ఈ దోషాలను సవరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ ను జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 52వ పేజీ 32 వ లైన్లో ఆంగ్లంలో ఉన్న "(బి) ఆఫ్టర్ పార్ట్ XXIV" ని ఇకమీదట (బి) ఆఫ్టర్ పార్ట్ XXII" గా చదువుకోవాలనేది ఈ సవరణల్లో ఒకటి కాగా...రెండవది అదే పేజీ 33వ లైన్లో ఉన్న "పార్ట్ XXV- తెలంగాణా" అన్న పదబంధాన్ని "పార్ట్ XXIII-తెలంగాణా" గా చదువుకోవాలని అందులో పేర్కొన్నారు.
గెజిట్ విడుదల సందర్భంగా కేంద్ర న్యాయశాఖ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. ఈ సవరణలు కేవలం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లోని ముద్రణా దోషాలను సరిచేసేందుకే తప్ప, ఈ సవరణల వల్ల ఆ చట్టంలో అర్థంలో కానీ, నిబంధనల్లోకానీ ఏవిధమైన మార్పురాదని కేంద్ర న్యాయశాఖ అధికారులు తెలిపారు. కేవలం క్లరికల్ మిస్టేక్స్ని గుర్తించి వాటిని సరిచేసేందుకే ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్-2014 చట్టాన్నే తెలుగులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 గా పేర్కొంటుండగా వ్యవహారికంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంగా వ్యవహరిస్తున్నారు. 2014 సంవత్సరంలో అప్పటి యుపిఎ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఆదేశిస్తూ...ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనవరి 30న రద్దు చేసింది...అయినప్పటికీ ఫిబ్రవరి మూడవవారంలో పార్లమెంటు ఆమోదించిన విషయమూ విదితమే.
ఈ చట్టం ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి మరియు వరంగల్ జిల్లాలతో కూడుకున్న ప్రాంతాన్ని తెలంగాణాగా...మిగతా జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ లేదా కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాలుగా విభజించడం జరిగింది.