ఆడుకుందామని తీసుకెళ్లి..: బాలిక లోదుస్తులు తొలగించి మైనర్ అత్యాచారయత్నం!
గుంటూరు: జిల్లాలో దాచేపల్లి ఘటన ఇంకా మరిచిపోకముందే మరిన్ని అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన బాలిక తల్లి పోలానికి వెళ్లగా ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఇంటి వద్దకు వచ్చిన స్థానిక బాలుడు ఒకరు.. ఆడుకుందామని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు. స్థానికంగా ఉన్న మరో ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
బాలిక లోదుస్తులను తొలగించి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. బాలుడి చేష్టకు బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. అతను అక్కడినుంచి పరారయ్యాడు. పొలం నుంచి తల్లి ఇంటికి వచ్చిన తర్వాత బాలిక ఆమెతో జరిగిన విషయం చెప్పింది. ఒంటిపై అయిన గాయాలను తల్లికి చూపించింది. దీంతో బాలికను వెంటపెట్టకుని పెదకూరపాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది ఆమె తల్లి.
అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. అత్యాచారం జరగలేదని, యత్నం మాత్రమే జరిగిందని చెప్పారు. దీంతో స్థానిక కులపెద్దలకు విషయం చెప్పి దీనిపై పంచాయితీ పెట్టినట్టు తెలుస్తోంది. బాలిక తల్లి నుంచే పంచాయితీ పెద్దలు అపరాధ రుసుం వసూలు చేసినట్టు సమాచారం. దీంతో తమకు న్యాయం జరగాలంటూ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న మేడికొండూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.