విశాఖలో మైనర్ దళిత బాలికపై రేప్..
విశాఖపట్నం : విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 15 ఏళ్ల దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు 22 ఏళ్ల ఓ యువకుడు. గురువారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా శుక్రవారం నాడు బాధిత బాలిక తల్లిదండ్రులు గాజువాక పోలీసులను ఆశ్రయించంతో విషయం వెలుగుచూసింది.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికపై అత్యాచారం చేసిన గౌరీశంకర్ మరియు అతని స్నేహితుడు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కేజీ ఆసుపత్రికి తరలించారు.
గాజువాక ఇన్ స్పెక్టర్ ఇమ్మాన్యుయెల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ పేరుతో గత రెండు వారాల నుంచి బాధిత బాలికను వెంబడిస్తున్నాడు గౌరీ శంకర్. ఇదే క్రమంలో గత గురువారం రాత్రి స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ గణేశ్ మండపం దగ్గరికి వెళ్లింది. విషయాన్ని గమనించిన గౌరీశంకర్.. ఆమెను బెదిరించి మరీ.. మెల్లిగా మాటలు కలిపాడు. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి ఆమెను సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అనంతరం అతడి స్నేహితుడు మణికంఠను బయట రక్షణగా పెట్టి.. గౌరీశంకర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటికొచ్చాక.. జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం.