నెల్లూరు జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు: జనం పరుగులు, ఇది 10వసారి
నెల్లూరు: జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. దుత్తలూరు మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం ఉదయం 9:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో భూమి కంపించింది. బోడవారిపల్లి, దుత్తలూరు, నర్రవాడ, లక్ష్మీపురం, కమ్మవారిపాలెం, బండకిండపల్లి తదితర గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
వారం రోజుల వ్యవధిలో రెండోసారి సదరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కాగా, నెల్లూరు జిల్లాలో గత 3నెలల వ్యవధిలో భూమి కంపించడం ఇది పదోసారి కావడం గమనార్హం.

నీటిగుంతలో పడి బాలిక మృతి
నెల్లూరు జిల్లాలోని కావలి మండలం అన్నగారిపాలెం వద్ద ఉన్న ముందరపొట్టెమ్మ ఆలయం వద్ద నీటి గుంతలోపడి మొగిలి ఇందూరి (6) అనే బాలిక సోమవారం మృతి చెందింది. మండలంలోని కోటడవికి చెందిన రమేష్, సుభాషిణి దంపతుల కుమార్తె ఇందూరి. తల్లిదండ్రులు బాతులు పెంచుకుని ఉపాధి పొందుతున్నారు.
బాలికను వీరి వెంటే తీసుకెళ్లారు. బాలిక నీటి గుంతలో దిగడంతో నీట మునిగింది. గమనించిన తల్లిదండ్రులు నీటిలో నుంచి బాలికను బయటకు తీసి తుమ్మలపెంటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. కళ్లముందే తిరిగిన బాలిక మృత్యుపాలవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.












Click it and Unblock the Notifications