నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు, జనం పరుగులు: చలి గాలులకు ఆరుగురు మృతి
నెల్లూరు: జిల్లాలో బుధవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. వింజమూరు మండలం చాకలికొండ, గొల్లవారపల్లి, పత్తినివారిపల్లిలో భూమి కంపించింది. వింజమూరు మండలంలో దాదాపు 5 సెకన్లపాటు ఈ ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
Photos: నెల్లూరు అతలాకుతలం
చలిగాలులకు ఆరుగురు వృద్ధులు మృతి
నెల్లూరు జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి వీస్తున్న చలిగాలులకు తట్టుకోలేక ఆరుగురు వృద్ధులు మృతి చెందారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. వాసిలి వద్ద జాతీయ రహదారిపై గండికొట్టడంతో నెల్లూరు-ముంబయి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఏఎస్పేట మీదుగా వాహనాలు మళ్లించారు.
సంగం ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతి ఇంకా తగ్గలేదు. సంగం ఆనకట్ట నుంచి సముద్రంలోకి 1.30లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సంగం నుంచి పొదలకూరు, చేజర్లకు నాలుగోరోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
తగ్గుముఖం పట్టిన వర్షం
గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లాను అతలాకుతం చేసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం అర్ధరాత్రి నెల్లూరు, గూడూరు డివిజన్లలో వర్షాలు కురవకపోవడంతో వరదతీవ్రత క్రమంగా తగ్గుతోంది.