దారుణం : కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. దిశ చట్టం కింద కేసు నమోదు
మహిళా భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. వారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు మాత్రం తెరపడటం లేదు. స్కూళ్లు,కాలేజీలు,పని ప్రదేశాలు,బహిరంగ ప్రదేశాలు.. ఆఖరికి ఇంట్లోనే మహిళలు లైంగిక దాడులకు గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సొంత ఇంట్లోనే మహిళలకు రక్షణ కరువైతే పరిస్థితేంటి..? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నబిడ్డను కాటేస్తే.. మానవత్వం సిగ్గుతో చచ్చిపోదా...? తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
అసలేం జరిగింది...?
చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దామరకుప్పానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి.. కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు
కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. రెండో భార్యకు కలిగిన 13 ఏళ్ల కూతురు చిత్తూరులోని బీసీ సంక్షేమ హాస్టల్లో చదువుకుంటోంది. ఇటీవల సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై కన్నేసిన తండ్రి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన ఘటన గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కృష్ణయ్యపై పోలీసులు దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.కృష్ణయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఘటనక సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లైంగిక దాడులకు ..
హైదరాబాద్ షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి.. 21 రోజుల్లో నిందితుడిగా శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇక చిన్నారులు,మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే చట్టం ప్రకారం సోషల్ మీడియాలో మహిళలను వేధించేవారికి.. మొదటిసారైతే రెండేళ్లు,రెండోసారైతే నాలుగేళ్లు శిక్ష విధించనున్నారు. దిశ చట్టం కింద కేసులను విచారించేందుకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.