మైనర్ బాలికపై మిలిటరీ ఉద్యోగి లైంగిక దాడి;సహకరించిన వివాహిత:ఇద్దరిపై ఫోక్సో కేసు
ప్రకాశం జిల్లా:ప్రకాశం జిల్లా గిద్దలూరులో మదమెక్కిన ఓ మిలిటరీ ఉద్యోగి మృగాడిగా మారి మైనర్ బాలికను చెరపట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కామాంధుడు మైనర్ బాలికను చెరిచేందుకు ఆ బాలిక తల్లి స్నేహితురాలైన మరో వివాహిత సహకరించింది. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోలీసులు ఈ మిలిటరీ ఉద్యోగి, అతడికి సహకరించిన వివాహితపై ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు.
జనవరి 27వ తేదీన ఈ సంఘటన జరుగగా నిందితుడి బెదిరింపులకి భయపడి బాలిక ఈ విషయం బైటకు వెల్లడించలేదు. అయితే బాలిక అస్వస్థతకు గురవడంతో అనుమానమొచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బైటపడింది.వివరాల్లోకి వెళితే...
మిలిటరీ ఉద్యోగి...మైనర్ బాలికపై కన్నేశాడు...
గిద్దలూరు పట్టణంలోని కొంగళవీడు రోడ్డుకు సమీపంలో నివసించే 16 ఏళ్ల బాలిక ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. వీరి ఇంటికి సమీపంలోనే నివసించే మిలటరీ ఉద్యోగి అభిలాష్ ఐదు నెలల క్రితం సెలవుల కోసం స్వస్థలానికి వచ్చినప్పుడు ఈ బాలిక వెంటపడి వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం ఇంట్లో చెబితే చదువు మాన్పించేస్తారేమోనన్నభయంతో ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా దాచింది.
తిరిగి ఉద్యోగానికి వెళ్లాడు...మళ్లీ సెలవులకు వచ్చి...
ఆ తర్వాత అతను సెలవులు అయిపోవడంతో ఉద్యోగానికి తిరిగి వెళ్లడంతో విద్యార్థిని ఊపిరిపీల్చుకుంది. అయితే ఆ తరువాత అతడు ఇటీవలే సెలవులపై మళ్లీ గిద్దలూరు వచ్చాడు. మళ్లీ బాలికను చూసిన అతడు తనను పెళ్లి చేసుకోమంటూ బాలిక వెంటపడ్డాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఎలాగైనా ఆమెని అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పక్కా ప్లాన్ కూడా వేశాడు.
తల్లి స్నేహితురాలి సాయంతో...బాలికపై లైంగిక దాడి...
తన ప్రణాళికలో భాగంగా ఆ బాలిక తల్లికి స్నేహితురాలైన శకుంతల అనే మహిళ ను మచ్చిక చేసుకున్నాడు. ఆమెకి ఏమి ఆశ చూపించాడో గానీ ఆమె ఈ బాలికను ఎలాగైనా తెచ్చి మిలిటరీ ఉద్యోగి అభిలాష్ కు అప్పగించేందుకు అంగీకరించింది. అందుకు అతడితో కలసి స్కెచ్ వేసిన శకుంతల తమ ప్లాన్ ప్రకారం బాలిక తల్లి వద్దకు వెళ్లి తన భర్త నైట్ డ్యూటీకి వెళ్తున్నాడని, వారం రోజుల దాకా రాడని, తానొక్కదాన్నే ఉండాల్సి వస్తుందని, మీ అమ్మాయిని ఈ వారం తోడుగా పడుకునేందుకు పంపమని కోరింది. దీంతో వీరి కీచక ప్లాన్ తెలియని బాలిక తల్లి శకుంతల ఇంటికి తన కుమార్తెను పంపింది. అలా తల్లి స్నేహితురాలికి తోడుగా వచ్చిన మైనర్ బాలికపై జనవరి 27 అర్ధరాత్రి మిలటరీ ఉద్యోగి అభిలాష్ పథకం ప్రకారం లైంగికదాడికి పాల్పడ్డాడు.
డిప్రెషన్ లో బాలిక...విషయం వెలుగులోకి...పోలీసులకు ఫిర్యాదు
అయితే జనవరి 27 మరుసటి రోజు నుంచి కుమార్తె బాగా ముభావంగా మారిపోవడంతో తల్లిదండ్రులకు అనుమానమొచ్చి ప్రశ్నించగా అసలు విషయం చెప్పేసింది. దీంతో ఆ తల్లిదండ్రులు పరువుకు భయపడి విషయాన్ని దాచి చివరికి ఈ నెల 11న మార్కాపురం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అభిలాష్ తో పాటు అతడికి సహకరించిన శకుంతలపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.