టీటీడీ జేఈఓ నివాసంలో చోరీ: అన్ని బంగారు, వెండి వస్తువులే: రూ.6.5 లక్షల రూపాయల విలువ
తిరుపతి: సీనియర్ ఐఎఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి బసంత్ కుమార్ నివాసంలో దొంగలు పడ్డారు. భారీ మొత్తంలో చోరీకి పాల్పడ్డారు. విలువైన బంగారు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఈ ఘటనపై తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తన నివాసంలో చోరీ జరిగిన విషయాన్ని బసంత్ కుమార్ ధృవీకరించారు. ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
బసంత్ కుమార్.. తన కుటుంబంతో సహా తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఇంటి కిటికీల ఊచలు, గ్రిల్స్ను తొలగించి దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. చోరీ సమయంలో బసంత్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. బెడ్రూమ్లకు బయటి నుంచి తాళాలు వేసి, చోరీకి పాల్పడ్డారు. బీరువాలో దాచి ఉంచిన బంగారు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు తేలింది. వెంటనే ఆయన ఎస్వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
18 తులాల బంగారం, అయిదు తులాల వెండి వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి విలువ సుమారు ఆరున్నర లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఆగంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ రవీంద్రనాథ్ తెలిపారు. బసంత్ కుమార్ నివాసం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని అన్నారు. బయటి వ్యక్తుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
Recommended Video
సీనియర్ ఐఎఎస్ అధికారి కావడంతో ప్రొటోకాల్ ప్రకారం ఆయన నివాసానికి బందోబస్తును ఏర్పాటు చేశామని, అయినప్పటికీ.. గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. కిటికీ ఊచలు తొలగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని అన్నారు. సమాచారం అందిన వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు రవీంద్రనాథ్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.