ఔటర్పై కారుబోల్తా: ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేనికి తీవ్రగాయాలు, భార్య మృతి
హైదరాబాద్: నగర శివారు పహాడీషరీఫ్ ఔటర్ రింగ్రోడ్డు వద్ద మంగళవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్(ఆప్కాబ్) ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ఆయన భార్య సత్యవాణి, కారు డ్రైవర్ దాసు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును శంషాబాద్లోని ట్రెజెండ్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. సత్యవాణి, దాసు మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ముందు సీట్లో కూర్చున్న పిన్నమనేని సీటు బెల్టు పెట్టుకోవడంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పిన్నమనేని జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు వెనువెంటనే పూర్తి వివరాలపై ఆరా తీశారు. పిన్నమనేని చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసిన ఇద్దరు మంత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
పిన్నమనేనికి మెరుగైన వైద్యం అందించాలని, ఆయన త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. పిన్నమనేని సతీమణి మృతి పట్ల వారిద్దరూ తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.