భార్యాపిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానన్న వ్యాపారి చిక్కాడు
హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురం ఇంటి నుంచి భార్యాపిల్లలతో పరారైన రియల్టర్ సుబ్బారావు చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. భార్యాపిల్లలను హత్య చేసి, తాను అత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి పెట్టి 31వ తేదీ తెల్లవారు జామున ఆయన వెళ్లిపోయాడు. భార్యాపిల్లలతో వెళ్లిపోయిన సుబ్బరావు అదృశ్యంపై ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మూడు రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా సుబ్బారావు తప్పించుకుంటూ వచ్చాడు.
చివరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ టోల్ గేట్ వద్ద పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కుటుబసభ్యులతో సహా అతన్ని పోలీసులు హైదరాబాదు తీసుకుని వచ్చారు. అతనికి పోలీసులు సుబ్బారావుకు కౌన్సెలింగ్ చేస్తున్నారు. భార్యాపిల్లలను కూడా విచారిస్తామని పోలీసులు చెప్పారు. వారిని విచారించిన తర్వాత ఏం చేయాలనే విషయాన్ని ఆలోచిస్తామని అన్నారు. అప్పుల కారణంగానే అతను పారిపోయాడని పోలీసులు చెప్పారు.
ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు ఆయన పది వేల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఓ బ్యాంకు నుంచి కొంత డబ్బు డ్రా చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. అతను భార్యాపిల్లలతో నాగపూర్ పారిపోయినట్లు పోలీసులు గమనించారు. ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లాలోకి బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి సుబ్బారావు వచ్చాడు. దాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
సుబ్బారావుకు 70 లక్షల రూపాయల అప్పు ఉందని తెలుస్తోందని, దానివల్లనే కుటుంబంతో కలిసి పారిపోయాడని పోలీసులు చెప్పారు. ఆ విషయాన్ని సుబ్బారావు కూడా ధ్రువీకరించాడు. అయితే, తనకు ఎవరినీ మోసం చేయాలని లేదని అతను అన్నాడు. సుబ్బారావు 8 పేజీల లేఖ రాసి ఇంట్లో పెట్టి భార్యాపిల్లలతో వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో వ్యాపారి సుబ్బారావు అనే వ్యక్తి అదృశ్యమైన విషయం తెలిసిందే. తనతో పాటు భార్యా పిల్లలను తీసుకుని వెళ్లిపోయారు. ఆ కుటుంబం కనిపించకపోవడంతో బంధువులు, స్థానికులు చుట్టు పక్కల వెతికారు. ఆచూకీ లభించలేదు. చివరకు ఇంట్లో వెళ్లి చూడగా ఒక లేఖ లభ్యమైంది.
భార్యా పిల్లలను చంపి తాను చనిపోతానని లేఖలో రాసి ఉంది. బంధువులు, సుబ్బారావు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బారావు కుటుంబం అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.