బియాస్ ట్రాజెడీ: డెత్ సర్టిఫికేట్లు, కాలేజ్ వద్ద ఆందోళన
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థులకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధికారులు మిస్సింగ్, డెత్ సర్టిఫికేట్లు ఇరు. అకస్మాత్తుగా నదిలో నీరు పెరగడం వల్లే విద్యార్థులు కొట్టుకు పోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది. మరణ దృవీకరణ పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీలను అందించింది.
ఎఫ్ఐఆర్తో పాటు సర్టిఫికెట్లను వారి తల్లిదండ్రులకు అందజేశారు. అయితే మిస్సింగ్, డెత్ సర్టిఫికేట్ల పైన హిమాచల్ ప్రదేశ్ రాజముద్ర లేకపోవడంపై తల్లిదండ్రులు, బంధువులు, ఇతర విద్యార్థులు హైదరాబాదులోని విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కాలేజ్ వద్ద ఆందోళనకు దిగారు. పలువురు కళాశాలలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఇంకా దొరకని మృత దేహాల కోసం ఆధునాతన స్కానర్లు, కెమెరాలతో గాలింపు కొనసాగుతోందని హిమాచల్ ప్రదేశ్ అధికారులు తెలిపారు. భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఒక్క మృతదేహం కూడా బయడపడలేదు. సైడ్ సోనార్ పరికరాలు, మానవ రహిత విమానాలు ఉపయోగించినా, నీటి విడుదలను పూర్తిగా ఆపివేసి సంఘటన స్థలంలో గజ ఈతగాళ్లు విస్తృతంగా గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
24 మంది గల్లంతు కాగా ఎనిమిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా వారి జాడ తెలియడం లేదు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి హిమాచల్ నుంచి హైదరాబాదుకు బయలు దేరారు. అక్కడి రెస్క్యూ ఆపరేషన్ను తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. బియాస్ నదీ ట్రాజెడీ వెనుక ఎలాంటి నిర్లక్ష్యం లేదని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆదివారం అన్నారు.