అప్ డేట్:తల్లిని కాపాడి కాల్వలో కొట్టుకుపోయిన ఎస్ఐ...20కి.మీ ఆవల మృతదేహం;అసలేం జరిగిందంటే?...
కృష్ణా జిల్లా:తల్లిని కాపాడి కాల్వలో కొట్టుకుపోయిన ఎస్ఐ వంశీధర్ గల్లంతు ఉదంతం విషాదాంతమైంది. సుమారు 20 కి.మీ ఆవల ఎస్.ఐ వంశీధర్ మృతదేహం లభ్యం కావడంతో అందరినీ కలచివేసింది.
శనివారం ఘంటసాల మండలం పాపవినాశనం దగ్గర...కేఈబీ కెనాల్లో రామచంద్రాపురం ఎస్ఐ వంశీధర్ గల్లంతు అయిన విషయం తెలిసిందే. వంశీధర్ ప్రాణాలతో బైటపడతాడని కుటుంబ సభ్యులతో సహా అందరూ ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో అతడి మృతదేశం లభ్యమైందన్న వార్తతో దిగ్భ్రాంతి చెందారు. ఎస్ ఐ వంశీధర్ రెండు సార్లు ప్రాణాలు కాపాడుకునే అవకాశం వచ్చినా మూడో సారి మృత్యువు అతడిని వెంటాడి లాక్కెళ్లిపోయిందని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు.
కృష్ణాజిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్బేగ్పేటకు చెందిన కోట వంశీధర్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్ఐగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం మచిలీపట్నంలోని బంధువుల ఇంట జరిగే వివాహానికి హాజరయ్యేందుకు ఉదయం రామచంద్రాపురం నుంచి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో తన స్వగ్రామమైన ఇస్మాయిల్బేగ్ పేటలో తల్లి లక్ష్మిని దించి వెళ్లాలన్నది ఆయన ఉద్దేశం.
ఈక్రమంలో విజయవాడ-అవనిగడ్డ మధ్య కరకట్టపై ప్రయాణిస్తుండగా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కారు ముందుటైరులో గాలి ఒక్కసారిగా తగ్గిపోవడంతో కారు భారీ కుదుపులకు లోనై అదుపుతప్పి పక్కనే ఉన్న కేఈబీ కెనాల్లోకి దూసుకుపోయింది. అయితే కారు కెనాల్ లో మునిగిపోతున్న క్రమంలో ముందు సురక్షితంగా కారు నుంచి బైటపడిన ఎస్ వంశీథర్ తల్లిని కాపాడే ప్రయత్నం చేశాడు. మునిగిపోతున్న కారులో ఉన్న తల్లిని రక్షించే క్రమంలో అమ్మా..అమ్మా...! ...అంటూ కేకలు వేస్తూ డోర్ తెరిచే ప్రయత్నం చేస్తుండగా ఆ అరుపులు విన్న స్థానికులు వెంటనే నీళ్లలోకి దిగి ఎస్ ఐ తల్లిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఆ క్రమంలో ఒడ్డుకు చేరుకున్న వంశీధర్ కారులోని విలువైన నగలు,నగదును కూడా కాపాడుకుందామని తిరిగి కారు వద్దకు వెళ్లి ప్రయత్నం చేస్తున్న క్రమంలో నీటి ఉధృతి ఎక్కువైంది. ఈ క్రమంలో ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఎస్ఐ ను కాపాడేందుకు చేతులు అందించగా క్కించుకోవాలని చేతికి అందినట్లే అంది ప్రవాహ ఉధృతికి కాలువలో కొట్టుకుపోయారు. అలా తల్లి కళ్లెదుటే కన్నకొడుకు కాలువలో కొట్టుకుపోతూ గల్లంతవడంతో ఆమె షాక్ కు గురయ్యారు.
అలా కొట్టుకుపోయిన ఎస్ ఐ వంశీధర్ ప్రాణాలతో బైటపడతాడని అందరూ ఆశించినా...ఆయన మృతదేహం చల్లపల్లి మండలం మంగలాపురం దగ్గర పంట కాలువలో లభ్యమైందని తెలియడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఆయన గల్లంతైన ప్రదేశానికి ఆయన మృతదేహం లభించిన ప్రదేశం సుమారు 20 కి.మీ. దూరంలో ఉందంటే ప్రవాహం ఉధృతి ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎస్ఐ వంశీధర్ కు తన తల్లి అంటే ఎంతో ప్రేమ అని చివరకు ఆ తల్లిని కాపాడే తాను ప్రాణాలు కోల్పోయాడని బంధువులు చెప్పుకుంటున్నారు. ఎస్ ఐ వంశీధర్ ఆమెకు ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకునే వారని...విధి నిర్వహణతో ఎంత పని ఒత్తిడి ఉన్నా...తల్లి ఆరోగ్య పరిరక్షణకూ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని అంటున్నారు. ఎన్ని పనులున్నా ప్రతి నెల క్రమం తప్పకుండా చికిత్స నిమిత్తం ఆమెను విజయవాడలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లడం మరిచే వారు కాదని...ఆ క్రమంలోనే ఆమెను ఆసుపత్రిలో చూపించి, అక్కడి నుంచి స్వగ్రామం కోడూరు తీసుకువెళ్లేందుకు వస్తున్న క్రమంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఆయన కాలువలో గల్లంతయ్యారు.