ఎంజేఆర్ విద్యా సంస్థల అధినేత వెంకట రమణారెడ్డి ఆత్మహత్య
చిత్తూరు: ఎంజేఆర్ విద్యా సంస్థల అధినేత, పీలేరు మాజీ ఎంపీపీ మంచూరి వెంకట రమణారెడ్డి గురువారం సాయంత్రం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికంగా ఈ ఘటన విషాదం నింపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన మంచూరి వెంకట రమణారెడ్డి(52) పీలేరు-కల్లూరు మార్గంలోని అగ్రహారం సమీపంలో ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు. గురువారం కళాశాల ముగిసిన అనంతరం కారులో పులిచెర్ల మండలం కొడిదిపల్లె సమీపంలోని రైల్వే గేటు వద్దకు వెళ్లారు. అక్కడే కారు దిగిన ఆయన ఏదైనా తినడానికి తీసుకురమ్మని డ్రైవర్ను పంపించారు.
అదే సమయంలో తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్లే ప్యాసింజర్ రైలు వస్తుండటంతో రైల్వే గేటు సమీపంలో ఉండొద్దని రైలు సిబ్బంది వెంకటరమణారెడ్డికి తెలిపారు. దీంతో ఆయన ట్రాక్ పక్కన పీలేరు వైపు నడుచుకుంటూ కొంత దూరం వెళ్లారు. రైలు వచ్చే సమయానికి పట్టాలపైకి రావడంతో వేగంగా వస్తున్న రైలు ఆయన్ను ఢీకొంది.
సుమారు వందమీటర్ల వరకు అతని శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఆయన శరీర భాగాలు ట్రాక్పై చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటనపై సమాచారం అందుకున్న పీలేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, రమణారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.