మళ్లీ తెరపైకి ఓటుకు నోటు: 'ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు ఎన్నడూ చెప్పలేదు'
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున ఆ కేసు విషయంలో తాము కల్పించుకోబోమని శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులకెళ్తూ ఆయన ఎదుర్కుంటున్న కేసుల్లో స్టేలు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు మొత్తం 18 కేసుల్లో న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో తన తప్పు లేకపోతే చంద్రబాబు హైకోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, నల్లధనంతో తెలంగాణలోని ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోవాలని చూశారని ఆయన ఆరోపించారు.
ఏసీబీకి చిక్కిన ఆడియో టేపుల్లోని వాయిస్ చంద్రబాబుదేనని ఆయన ఆరోపించారు. ఆడియో టేపుల్లో ఉన్న గొంతు తనది కాదని చంద్రబాబు ఇప్పటి వరకు చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శిక్ష పడితీరుతుందని ఉద్ఘాటించారు.
కాగా, ఓటుకు నోటు కేసులో హైకోర్టు స్టే ను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరిపించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
అయితే 'ఓటుకు నోటు' కేసుపై ఈరోజు నుంచి నాలుగు వారాల్లో విచారణ జరిపి, పరిష్కరించాలని ఈ సందర్భంగా హైకోర్టుకు సుప్రీం సూచించింది.