'తల్లి సాక్షిగా చెబుతున్నా.. వాళ్లు నమ్మితే చాలు; రాజకీయంలో 30కోట్లు లాస్'
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ప్రధాన బుకీ కృష్ణసింగ్ కాలేడేటాను బయటపెట్టాలంటూ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ డిమాండ్ చేశారు.
నెల్లూరు: నెల్లూరు కేంద్రంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగుల వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. బెట్టింగులతో లింకులున్న రాజకీయ నాయకులను సైతం వారు వదిలిపెట్టడం లేదు. అయితే ఈ విషయంలో కేవలం వైసీపీ నేతలనే పోలీసులు టార్గెట్గా చేసుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ప్రధాన బుకీ కృష్ణసింగ్ కాలేడేటాను బయటపెట్టాలంటూ ఎమ్మెల్యే అనిల్ డిమాండ్ చేశారు. బుకీలతో టీడీపీ నేతలకు సంబంధాలున్నా వారికెందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
తల్లి సాక్షిగా చెబుతున్నా..
బెట్టింగ్ వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలను నిందితులను చేయడం బాధాకరమని అన్నారు. 'తల్లి సాక్షిగా చెబుతున్నాను.. బెట్టింగ్ వ్యవహారంతో నాకెలాంటి సంబంధం లేదు. ఈరోజు నాకెంతో ముఖ్యమైన పెళ్లి రోజు. కానీ పోలీసులు విచారణకు రమ్మంటే వచ్చాను. జిల్లా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మా నాయకులు ఆ విషయం నమ్మితే చాలు' అని అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
30కోట్లు పోగొట్టుకున్నా:
రాజకీయాల్లోకి వచ్చాక రూ.30కోట్ల ఆస్తులను పోగొట్టుకున్నానని అనిల్ చెప్పుకొచ్చారు. బెట్టింగ్లో పట్టుబడ్డ బుకీల్లో సుళ్లూరుపేటకు చెందిన అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి ఒక్కరే వైసీపీ నేత అని, మిగిలిన ప్రధాన బుకీలంతా టీడీపీ అనుచరులేనని స్పష్టం చేశారు.
పక్కదారి పట్టిస్తున్నారు: కాకాని
క్రికెట్ బెట్టింగ్ కేసును పక్కదారి పట్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఓవైపు వైసీపీ నేతలకు కేసుతో సంబంధం లేదని ఎస్పీ చెబుతున్నా వినకుండా నోటీసులు జారీ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అరెస్టయిన బుకీల్లో ఎక్కువమంది టీడీపీకి చెందినవారేనని చెప్పారు. ప్రధాన బుకీ ఇంట్లో విందుకు మంత్రులు, టీడీపీ నేతలు హాజరయ్యారని అన్నారు. క్రికెట్ బుకీల కాల్ డేటాను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు.
మరో ఇద్దరిని:
క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి ఇప్పటికే వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ను మంగళవారం ఎస్పీ విచారించారు. మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా విచారించే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.